ఇవిగో ఖతార్ కష్టాలు: కలతలకు దారి తీసిన అమెరికా హెచ్చరిక
ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తున్నారన్న సాకుతో సౌదీ అరేబియా సారథ్యంలో ఏడు దేశాలు సంబంధ బాంధవ్యాలు తెంచుకోవడంతో ఖతార్ పౌరులు అనూహ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
దోహా: ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తున్నారన్న సాకుతో సౌదీ అరేబియా సారథ్యంలో ఏడు దేశాలు సంబంధ బాంధవ్యాలు తెంచుకోవడంతో ఖతార్ పౌరులు అనూహ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఖతార్ మిత్రపక్షం టర్కీ నుంచి సరఫరా అవుతున్న పాలు, జ్యూస్ తదితరాలు అవసరాలకు సరిపోవడం లేదు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఖతార్ మీదుగా సాగే విమాన ప్రయాణాలను దారి మళ్లించడంతో దోహా విమానాశ్రయం కేంద్రంగా సర్వీస్ అందిస్తున్న క్యాబ్స్ తమ సేవలను సస్పెండ్ చేస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని ఖతార్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కుటుంబాల్లో విభేదాలు తలెత్తుతున్నాయి.
ఖతార్ పొరుగు దేశం ఈజిప్టు పౌరురాలు హనన్. వైద్యుడిగా గత నాలుగేళ్లుగా దోహాలో జీవిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఈజిప్టునకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. తన పిల్లలు చదువుతున్న స్కూళ్లకు వెళ్లి వారి సర్టిఫికెట్లన్నీ తీసేసుకున్నారు. బ్యాంకులో ఉన్న నగదు ఈజిప్టునకు బదిలీ చేశారు. తన పిల్లలను ఈజిప్టునకు తీసుకెళ్లేందుకు అదనపు సూటుకేసులు కూడా కొన్నారు.
దోహాలో ఉన్నప్పుడు కొనుగోలు చేసిన విలువైన వస్తువులన్నీ సర్దేశారు. ఆమె తన కుటుంబంతో కలిసి కొద్ది రోజుల్లో కైరోకు తరలి వెళ్లేందుకు సర్వం సిద్ధంచేసుకున్నారు. ఇక భవిష్యత్లో ఆమె ఖతార్ రావాలని భావించడం లేదు. ఈజిప్టు వాసులంతా అనిశ్చిత పరిస్థితుల్లో సతమతమవుతున్నారని హనన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఖతార్ వాసుల్లో కలతలకు దారి తీస్తుందని అమెరికా హెచ్చరిక
తన కుటుంబం పూర్తి పేరు, వివరాలు చెప్పేందుకు హనన్ అనే ఈజిప్టు వైద్యురాలు నిరాకరిస్తున్నారు. దీనికి కారణం లేని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోజురోజుకు ఆమెపై ఒత్తిడి పెరిగిపోతున్నది. తన భద్రత గురించి హనన్, ఆమె స్నేహితులు తమ దేశంలోని బంధు మిత్రులకు ప్రతిరోజూ ఈ మెయిల్స్, ఫేస్ బుక్ ద్వారా తాము సురక్షితమనే సందేశాలు పంపుతూనే ఉన్నారు. మున్ముందు ఏం జరుగుతుందో తెలియదంటున్నారు. ఖతార్ తమ దేశాన్ని వీడి వెళ్లాలని కోరొచ్చు, ఈజిప్టు తమను వెనక్కు రావాలని కూడా కోరొచ్చునని ఆమె అంటున్నారు. ఆమె స్నేహితుల్లో చాలా మంది తమ పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారని చెప్పారు. తన పర్యటన వాయిదా వేసుకున్న ఆందోళన కొనసాగుతున్నదని హనన్ అన్నారు. సౌదీ అరేబియా సారథ్యంలో బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఈజిప్టు, యెమెన్, మాల్దీవులు తదితర దేశాలు ఖతార్తో సంబంధాలు తెంచుకుని వారం కావస్తున్నది. నాటి నుంచి ఈ పర్షియన్ గల్ఫ్ దేశ రాజధానిలో ఆందోళన, అనిశ్చితి, మౌనం రాజ్యమేలుతున్నాయి. స్థానికులంతా రాజకీయ కుట్ర, దౌత్య సంక్షోభం తలెత్తుతుందేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. సౌదీ అరేబియా సారథ్యంలో ఖతార్ పై విధించిన ఆంక్షలను తక్షణం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగశాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఆ దేశాలను కోరారు. ఈ ఆంక్షల వల్ల ఖతార్ పౌరులకు ఆహార కొరత సమస్యతోపాటు కుటుంబాల్లో కలతలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఖతార్పై ఆంక్షల ప్రభావం ఇలా
సౌదీ అరేబియా సారథ్యంలో విధించిన ఆంక్షల వల్ల అమెరికాతోపాటు అంతర్జాతీయ వాణిజ్యానికి దెబ్బ తగులుతుందని అమెరికా విదేశాంగశాఖ మంత్రి టిల్లర్సన్ పేర్కొన్నారు. అంతే కాదు అరబ్ రీజియన్లో ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్'కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి ఎదురు దెబ్బ తగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా టిల్లర్సన్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చాలా అత్యున్నత స్థాయిలో ఉగ్రవాదానికి భారీగా నిధులు సమకూర్చే దేశాల్లో ఒకటి ఖతార్ అని, దీన్ని ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. కానీ ఖతార్ మాత్రం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
ఖతార్తో సౌదీ అరేబియా సారథ్యంలో సంబంధాలు తెగిపోవడంతో దోహా వాసులకే కష్టాలు వచ్చి పడతాయి. ఖతార్ పూర్తిగా ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులన్నింటికీ దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. భూమార్గం, నౌకాయానం, విమానాల ద్వారా వస్తువులు దిగుమతి అవుతుంటాయి. ఇక సౌదీ సారథ్యంలోని ఏడు దేశాలు, ఖతార్ పరస్పరం తమ పౌరులను స్వదేశానికి తరలి రావడానికి రెండు వారాల గడువు పెట్టాయి.
జీసీసీలో విభేదాలు సభ్య దేశాలకు ఇబ్బందులిలా...
సౌదీ అరేబియా సారథ్యంలోని ఏడు దేశాలు విధించిన ఆంక్షలతో ఖతార్ దేశంలోని వేల మంది గల్ఫ్ వాసులను కష్టాల కొలిమిలోకి నెట్టేసిందని మానవ హక్కుల సంస్థ ‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్' ఆందోళన వ్యక్తం చేసింది. ఖతార్పై విధించిన ఆంక్షలతో కుటుంబాలు చీలిపోయాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు, భార్యల నుంచి భర్తలు విడిపోతున్నారని అబ్జర్వర్లు చెప్తున్నారు. ఖతార్ ఒక్కటే కాదు ఆంక్షలు విధించిన ఏడు దేశాల పౌరులు కూడా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు వారి పిల్లల విద్యాభ్యాసానికి అంతరాయం ఏర్పడుతున్నది. గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)లో సభ్యదేశాలుగా ఉన్న సౌదీ అరేబియా తదితర దేశాల్లోని తమ కుటుంబాలు నష్ట పోవాల్సి వస్తున్నదని ఖతార్ లో నివసిస్తున్న లెబనాన్ మహిళ వాలా ఎల్ కాదీ ఆవేదన వ్యక్తం చేశారు. జీసీసీలో ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) సహా మరో మూడు దేశాలకు సభ్యత్వం ఉన్నది.
నిర్మాణ సంస్థలపై ఇదీ ఎఫెక్ట్
ఒక నిర్మాణ సంస్థలో మేనేజర్గా పని చేస్తున్న ముస్తాఫా కూడా తాజా పరిణామాల పట్ల ఆందోళన చెందుతున్నాడు. పలు ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం అయ్యే అవకాశం ఉన్నదని వర్రీ అవుతున్నాడు. ఈ సంస్థ చేపట్టిన నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైన ముడి సరుకు, ఇతర వస్తువులన్నీ సౌదీ అరేబియా, యుఎఇ మీదుగానే రవాణా చేసుకోవాల్సి వస్తున్నది. ఆంక్షలు విధించడంతో ఖతార్తో ఉన్న నౌకాయాన సంబంధాలన్నీ సౌదీ అరేబియా తొలగించేసింది. మరో మూడు వారాలపాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ముస్తాఫా అంచనా వేస్తున్నారు.
యుఎఇ, బహ్రెయిన్ హెచ్చరికలు ఇలా
ఖతార్ పట్ల సానుభూతి చూపితే నేరం అని అదే జరిగితే పలు సంవత్సరాల జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని బహ్రెయిన్, యుఎఇ తమ పౌరులను హెచ్చరించాయి. ఖతార్పై విధించిన ఆంక్షలను సోషల్ మీడియా వేదికగా విమర్శించినా అదే శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ రెండు దేశాలు స్పష్టం చేశాయి. సౌదీ అరేబియా నుంచి ఆహార వస్తువులు దిగుమతి చేసుకుంటున్న పలు సూపర్ మార్కెట్లు కొంత కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆంక్షల ఫలితమా? అని సూపర్ మార్కెట్లలో ఉన్న వస్తువుల నిల్వలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ప్రత్యేకించి పాలు, పెరుగు కొరత బాగా ఎక్కువైందని అంటున్నారు. ప్రస్తుతానికి టర్కీ నుంచి పాలు, జ్యూస్ దిగుమతవుతున్నా వాటి కొరత ఖతార్ పౌరులను వెంటాడుతున్నది.
ఆహార కొరతపై ఇలా ఆందోళన
ఇంకా సమీప భవిష్యత్లో కొన్ని ఆహార వస్తువుల కొరత కొనసాగే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. మామూలుగా తాను 12 కిలోల ఉల్లిగడ్డలు కొనే వాడినని, నిజంగా తనకు అంత అవసరమా? అని సూపర్ మార్కెట్ సిబ్బంది అడుగుతుంటారని హైతీం ఎల్గామల్ అనే వ్యక్తి వ్యాఖ్యానించాడు. దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ట్యాక్సీ డ్రైవర్లు.. ఖతార్ పై ఆంక్షల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. విమానాలు దారి మళ్లించడమో, తాత్కాలికంగా నిలిపేయడం చేయడం వల్ల తక్కువ మంది ప్రయాణికులు రావడంతో ట్యాక్సీ ధరలు తగ్గించేస్తున్నారు.
ఖతార్ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చన్న ఈజిప్టు సంతతి సిటిజన్
కొంతమంది ఖతార్ పౌరులు మౌనంగా ఉంటున్నారు. కొందరు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. యుద్ధం వస్తుందేమోనన్న భయాందోళన ఖతార్ పౌరుల్లో నెలకొన్నది. కొంతమంది ఖతార్ పౌరులు తమ దేశభక్తిని చాటుకునేందుకు తమ ఇళ్లపై జాతీయ పతాకాలు ఎగరేస్తుంటారు. తాత్కాలికంగా విధించబడిన దౌత్య సంబంధాలు తర్వాత శత్రుత్వంగా మారతాయేమోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. మళ్లీ సౌదీ అరేబియా, యుఎఇ ఉత్పత్తులు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు.
ఎల్గామల్ ఖతార్లో జన్మించినా ఈజిప్టు పౌరసత్వం ఉన్నది. ఆయన కూడా ఖతార్కు సొంత నిర్ణయాలు తీసుకునే స్వాతంత్రం ఉన్నదని, సౌదీ సారథ్యంలోని డిమాండ్లకు ఖతార్ తలొగ్గాల్సిన అవసరమే లేదని చెప్తున్నారు. ఈజిప్టుకు వచ్చేయమని పిలుపు వచ్చినా తాను ఖతార్ ను వీడే ప్రసక్తే లేదన్నాడు. ఇదే తన పుట్టిన గడ్డ అని అంటున్నారు.