టీ ఇంచార్జీగా డిగ్గీపై వేటు: కొంప ముంచిన మీరా కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బాధ్యతల నుంచి దిగ్విజయ్ సింగ్ను కాంగ్రెసు అధిష్టానం తప్పించడం వెనక లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ హస్తం ఉందని అంటున్నారు. దిగ్విజయ్ సింగ్ను తప్పిస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం మీరా కుమార్ మాటల మీదే తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, దీనికి దిగ్విజయ్ సింగే కారణమని ఆమె కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చెవిలో ఉదారని చెబుతున్నారు. సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల బాధితులను పరామర్శించి వెళ్లిన తర్వాత ఆమె సోనియాకు ఆ విషయం చెప్పారని తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు ఇంచార్జీగా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఇంచార్జీగా వ్యవహరిస్తూ వచ్చారు.
వైఎస్తో సత్సంబంధాలు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా 2004లో దిగ్విజయ్ సింగ్ నియమితులయ్యారు.అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో ఆయన మంచి సంబంధాలుండేవి. ఆ తర్వాత ఆయన స్థానంలో అధిష్టానం గులాం నబీ ఆజాద్ను నియమించింంది. కానీ తర్వాత 2013లో తిరిగి దిగ్విజయ్ సింగ్ను ఎపి వ్యవహారాల ఇంచార్జీగా నియమించింది.
ఇది పెద్ద వైఫల్యం...
తెలంగాణ సెంటిమెంటును పార్టీకి అనుకూలంగా మలుచులేకపోవడం దిగ్విజయ్ సింగ్ పెద్ద వైఫల్యమంటారు. సోనియా గాంధీ నేతృత్వంలోని సిడబ్ల్యుసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ తెలంగాణలో దాన్ని ఉపయోగించుకుని పార్టీని నిలబెట్టడంలో దిగ్విజయ్ విజయం సాధించలేకపోయారనే విమర్శ ఉంది. మరోవైపు, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
గోవా దెబ్బ కూడా....
దిగ్విజయ్ సింగ్పై గోవా దెబ్బ కూడా పడింది. కాంగ్రెసు ఎక్కువ సీట్లు సాధించి, అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని చేజార్చుకుంది. గోవా పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా దిగ్విజయ్ సింగ్ వైఫల్యం కారణంగానే గోవాలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందనే విమర్శ ఆయనపై ఉంది. ఏప్రిల్లోనే కర్ణాటక, గోవా పార్టీ వ్యవహారాల బాధ్యతల నుంచి అధిష్టానం దిగ్విజయ్ సింగ్ను తప్పించింది.
కాంగ్రెసు వైఫల్యానికి....
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాంగ్రెసు పార్టీ విఫలమవుతూ వస్తుండడానికి దిగ్విజయ్ సింగ్ సరైన మార్గదర్శకత్వం చేయకపోవడం వల్లనే అనే మాట వినిపిస్తోంది. పార్టీని దారిలో పెట్టకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తెలంగాణలో రైతులకు పోలీసు సంకెళ్లు పడ్డాయి. మియాపూర్ భూకుంభకోణం వెలుగు చూసింది. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా కాంగ్రెసు పార్టీ వాటిని ఆలంబనగా చేసుకుని సత్తా చాటడంలో విఫలమైంది. దీనికి అధిష్టానం డిగ్గీనే బాధ్యుడ్ని చేసినట్లు కనిపిస్తోంది.
నకిలీ ఐఎస్ఐఎస్
వెబ్సైట్ను పోలీసులే సృష్టించి, ముస్లిం యువకులను ప్రోత్సహించి, ఆ తర్వాత అరెస్టులు సాగిస్తూ మోసం చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపింది. దానిపై పార్టీలో కూడా దుమారం చెలరేగింది. ఆయనపై పార్టీ నాయకుల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దిగ్విజయ్ పనితీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
రాష్ట్రానికి రాకుండా...
దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పర్యటనలు కూడా పెద్ద చేయడం లేదు. రాష్ట్రానికి వచ్చిపోతూ పార్టీని పటిష్టం చేసే దిశగా ఆయన పనిచేసిన దాఖలాలు లేవు. పైగా, వివిధ విషయాలపై ట్వీట్లు చేస్తూ తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అర్థం పర్థం లేని ట్వీట్లతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయే తప్ప లాభం జరగడం లేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు నాయకుల ఆవేదనగా చెబుతున్నారు
మీరా కుమార్ వచ్చి వెళ్లాకనే....
రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు ఓసారి వచ్చిన మీరా కుమార్ తాజాగా సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల గ్రామాన్ని ఇటీవల సందర్శించారు. నేరెళ్లలో ఆమె పర్యటించి వెళ్లిన వెంటనే దిగ్విజయ్ సింగ్పై వేటు పడింది. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే సమస్యలు ఉన్నప్పటికీ దిగ్విజయ్ సింగ్ ఆచరణలో ఏ మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదని భావించినట్లు తెలుస్తోంది. అయితే, గత ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్ను తీసేయకపోవడం విశేషం.