అంతా ఏకం కావాల్సిందే: 2019లో మోడీని ఎదుర్కొనేందుకు సోనియా బిగ్ ప్లాన్
న్యూఢిల్లీ: అధికార భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పట్నుంచి భారీ సన్నాహాలకు తెరతీస్తున్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే యూపీఏతోపాటు తమతో కలిసివచ్చే ఇతర పార్టీలను కలుపుకోవాలని చూస్తున్నారు.
Recommended Video
అనూహ్యం: టీడీపీ ఎంపీలతో సోనియా భేటీ! కీలక చర్చ, స్పీకర్ వార్నింగ్
ప్రజాస్వామ్యం, సెక్యూలరిజం, సహనం, ఆర్థిక ప్రగతి కావాలంటే బీజేపీని ఓడించాలంటూ ఆమె పార్టీలకు పిలుపునిస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతిపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా సంతృప్తి వ్యక్తం చేశారు.
కలుపుకు పోదాం
‘వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో నాతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలు కలిసి చేద్దాం. కాంగ్రెస్ పార్టీతో భావ సారూప్యత ఉన్న ఇతర పార్టీలను కూడా కలుపుకు పోదాం. దేశంలో ప్రజాస్వామ్యం, సెక్యూలరిజం, ఆర్థిక ప్రగతికి ఇది అనివార్యం' అని సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు.
బీజేపీని ఎదుర్కొవాలంటే..
బీజేపీని ఎదుర్కొనేందుకు భావ సారూప్యత ఉన్న పార్టీలు యూనైటెడ్ ఫ్రంట్గా ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సోనియా అభిప్రాయడ్డారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ కలిసి భారీ కూటమికి ఏర్పడబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆ ఉత్సాహంతోనే ముందుకు
కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై సోనియా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో వచ్చే లోకసభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన రాజస్థాన్ ఉప ఎన్నికల్లోనూ మంచి ఫలితాలను సాధించాం' అని ఆమె చెప్పారు.
కాంగ్రెస్ గాలి వీస్తోంది..
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి దాదాపు 20ఏళ్ల తర్వాత 80సీట్లు గెల్చుకోవడం గమనార్హం. అంతేగాక, ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు లోకసభ, ఓ అసెంబ్లీ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ మూడు కూడా బీజేపీ సిట్టింగ్ సీట్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గాలి వీస్తుందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని సోనియా గాంధీ అన్నారు. అంతేగాక, త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీని ఓడించేందుకు..
మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోనియా పార్టీ నేతలకు సూచించారు. 2014 ఎన్నికలు మనకో గుణపాఠమని, అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు శాయశక్తులా ప్రయత్నించాలన్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్నది ప్రచార ఆర్భాటం తప్ప, మరేమీ లేదని సోనియా ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దాదాపు అన్ని ప్రభుత్వ, రాజ్యాంగ వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు.
మోడీవి అబద్ధపు ప్రసంగాలు
ప్రత్యర్థి పార్టీల నేతలపై విచారణ సంస్థలను ఉపయోగిస్తున్నారని, మైనార్టీలు, దళితులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే భావన కలుగుతోందని సోనియా అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుదంటూ మండిపడ్డారు. 2014 తర్వాత ఏమీ అభివృద్ధి జరగలేదని అన్నారు. ఉద్యోగ కల్పన లేదని, ఆర్థిక వ్యవస్థ కూడా చెప్పుకోదగిన రీతిలో లేదని అన్నారు. ప్రధాని మోడీ ప్రసంగాలు అవాస్తవాలతో కూడుకున్నవేనని సోనియా ఆరోపించారు.
సరైన సమయం ఇదే..
‘ఇదే సరైన సమయం. కాంగ్రెస్ దీన్ని ఇప్పటికే గుర్తించింది. ప్రాంతీయ పార్టీలకు కూడా ఈ విషయం తెలుసు. తమ ఇగోలను పక్కన పెట్టిన విపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సి ఉంది. లేదంటే బీజేపీనే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది' అని ఢిల్లీలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ప్రతినిధి సంజయ్ కుమార్ వెల్లడించారు.