ఇందిరా 'మృతి' షాకింగ్: మనం చూసే ప్రియాంక వేరు!
న్యూఢిల్లీ: దివంగత ఇందిరా గాంధీ తన మరణాన్ని ముందుగానే ఊహించిరా? తన రాజకీయ వారసురాలిగా ప్రియాంక గాంధీని ప్రకటించారా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన వ్యక్తి, కాంగ్రెస్ నేత ఎంఎల్ ఫోటేదార్ చెప్పారు.
ఇందిరా గాంధీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తన మనవరాలు ప్రియాంక గాంధీని తన రాజకీయ వారసురాలిగా కోరుకున్నారని అతను చెప్పారు. ఎంఎల్ ఫోటేదార్ ఇందిరా గాంధీకి చాలా కాలం రాజకీయ సలహాదారుగా పని చేశారు.
తనలా కనిపించే ప్రియాంక గాంధీ.. గొప్ప నేత అవుతుందని ఇందిరా ప్రగాఢంగా నమ్మారని ఆయన చెప్పారు. వచ్చే శతాబ్దం ప్రియాంక గాంధీది అని, ఆమె గొప్ప నేత అవుతుందని ఇందిర తనకు చెప్పారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్ల పత్రికతో చెప్పారు.
ఇందిర చనిపోవడానికి మూడ్రోజుల ముందు...
ఇందిర చనిపోవడానికి మూడు రోజుల ముందు... శనివారం నాడు తాము కాశ్మీర్లో ఉన్నామని, అక్కడ ఓ దేవాలయాన్ని సందర్శించామని అతను చెప్పారు. అక్కడ కాసేపు కూర్చొని, ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి బయలుదేరామని అతను చెప్పారు.
ఆ సమయంలో తనతో ప్రియాంక గురించి చెప్పారని ఎంఎల్ ఫోటేదార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె ప్రియాంక గురించి చెప్పిన ప్రతి అంశాన్ని ఆ రోజు రాత్రి రాసుకున్నానని చెప్పారు.
ఇందిరా గాంధీ మృతి అనంతరం తాను రాజీవ్ గాంధీకి.. ఈ విషయాన్ని (ప్రియాంక గురించి) చెప్పానని తెలిపారు. ఆ తర్వాత సోనియా గాంధీకి కూడా ఇదే విషయం చెప్పానని ఎంఎల్ ఫోటేదార్ చెప్పారు. ప్రియాంకలో తాను ఇందిరకు ఉన్న దూకుడు ఉందనుకుంటున్నానని చెప్పారు.
మనం ఇప్పుడు చూస్తున్న ప్రియాంక వేరు అన్నారు. ముందు ముందు చూడాలన్నారు. ఇందిరా గాంధీ చెప్పినట్లు రానున్న శతాబ్దం ప్రియాంక గాంధీదే అన్నారు. కాగా ఇందిరా గాంధీ అక్టోబర్ 31, 1984లో చనిపోయారు.