మైసూరా రెడ్డి కోసం సుజనా చక్రం, సీఎం రమేష్ బెంగ
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి చేరికలకు తెలుగుదేశం పార్టీ గేట్లు ఎత్తివేసింది! ఇందులో భాగంగా సోమవారం రాత్రి నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు, ఓ వైసిపి ఎమ్మెల్సీ సైకిల్ ఎక్కారు. ప్రజాప్రతినిధులతో పాటు కీలక నేతల పైనా టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది.
ఇందులో భాగంగా వైసిపి సీనియర్ నేత మైసూరా రెడ్డిని తమ పార్టీలోకి రప్పించేందుకు కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. అయితే, దానికి కడప జిల్లాకు చెందిన టిడిపి ఎంపీ సీఎం రమేష్ మోకాలు అడ్డుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇందుకు రెండు మూడు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. సీఎం రమేష్ కడప జిల్లాకు చెందిన వారు. చంద్రబాబు కోటరీలో కీలక నేతగా ఉంటున్నారు. మైసూరా రెడ్డి కూడా కడప జిల్లావారే. మైసూరా రెడ్డికి సిఎం రమేష్లాగే చంద్రబాబు వద్ద పలుకుబడి ఉంది.
ఇప్పుడు విపక్షంలో ఉన్న విషయం పక్కన పెడితే... టిడిపిలోకి వస్తే బాబుతో మైసూరా గతంలో ఉన్నట్లుగా మెలగగలరు. రాజకీయంగా ఆయనకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు మైసూరా పార్టీలోకి వస్తే... తన ప్రాబల్యం తగ్గుతుందని సీఎం రమేష్ ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.
ఇదే కాకుండా.. తన జిల్లాకే చెందిన మైసూరా రెడ్డిని సుజనా చౌదరి తీసుకు వస్తే చంద్రబాబు వద్ద తన ఇమేజ్ ఎంతోకొంత డామేజ్ అవుతుందని, తీసుకు వస్తే తాను తీసుకు రావాలనే అభిప్రాయంతో సీఎం రమేష్ ఉన్నారని తెలుస్తోంది.
ఓ వైపు మైసూరా రెడ్డిని తీసుకు వచ్చేందుకు సుజనా చౌదరి చక్రం తిప్పుతుంటే, మరోవైపు సీఎం రమేష్ తన ఆధిపత్యం ఎక్కడ తగ్గుతుందోననే ఆందోళనతో మోకాలడ్డుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఇరువురి మధ్య ఆధిపత్య పోరులా కనిపిస్తోందని అంటున్నారు.
కాగా, ఇప్పటికే వైసిపి నుంచి టిడిపిలో చేరిన నేతలకు చంద్రబాబు రెండు మంత్రి పదవులు ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి సైకిల్ ఎక్కారు.
వీరిలో భూమా కుటుంబానికి, జలీల్ ఖాన్లకు మంత్రిపదవులు వచ్చే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆదినారాయణ రెడ్డి తన బంధువు కేశవ రెడ్డి కేసుల్లో చిక్కుకోవడంతో సైకిల్ ఎక్కారని ఊహాగానాలు ఉన్నాయి. సుజన ప్రయత్నం ఫలించి.. మైసూరా టిడిపిలోకి వస్తే ఆయనకు ఏం ఇస్తారనే చర్చ కూడా సాగుతోందట.