చంద్రబాబు తీరు: తెరాసలోకి టిడిపి ఎమ్మెల్యేలు?
అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పలువురు తెరాస నేతలతో చేరిక విషయమై చర్చించినట్లుగా సమాచారం. విభజన తీరుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ... సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నప్పటి నుండి చంద్రబాబు వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
ఇటీవల విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చినప్పుడు చంద్రబాబు ఆగ్రహోద్రులయ్యారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ బాబు తీరు వ్యతిరేకమనే భావనను తెలంగాణవాదుల్లో, ప్రజల్లో కనిపిస్తోందని పలువురు టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
దీంతో ఆ పార్టీని వీడేందుకే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు సిద్ధమయ్యారంటున్నారు. వారు ఈ అసెంబ్లీ సమావేశాలలోపే తమ పార్టీలో చేరడం ఖాయమని తెరాస వర్గాలు భావిస్తున్నాయంటున్నారు. అయితే, శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టే అంశంపై పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.