'దశావతారం'ని మించిపోయాడే?: వెండితెర మీద కమల్.. పొలిటికల్ తెర మీద శివప్రసాద్
Recommended Video
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు మొదలైన నాటి నుంచి ఏపీ ఎంపీ శివ ప్రసాద్ నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. నటనలో ప్రావీణ్యం ఉన్న శివప్రసాద్.. రోజుకో కొత్త అవతారంలో పార్లమెంటు ఆవరణలో నిరసన చేస్తూ వస్తున్నారు. శివప్రసాద్ నిరసనల తీరు రాష్ట్రం పరువు తీసేలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నా.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గెటప్స్ మార్చడంలో వెండితెర మీద కమల్ హాసన్ను మించినవారు లేరు. రాజకీయాల్లో మాత్రం ఆ ఘనత శివప్రసాద్కే దక్కుతుందేమో!. ఈ నేపథ్యంలో ఆయన 'గెటప్స్'పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
'ఆమె'గా శివప్రసాద్..:
మలి విడత బడ్జెట్ సమావేశాల 11వ రోజు చీర కట్టుకుని మహిళ గెటప్లో పార్లమెంటుకు వచ్చారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. మహిళంటే ఆకాశంలో సగమని చెబుతుంటారని, ఆంధ్రప్రదేశ్ మహిళగా కేంద్రాన్ని నిలదీయడానికే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు.
'నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉద్యమిస్తారు. జాడించి కొడితే నిన్ను ఎక్కడో పోయి పడతావు. నువ్వు ఈ దేశానికి తగవు. చంద్రబాబులాంటి లీడర్ కు ద్రోహం చేస్తే ఇంకెక్కడ ఉంటావు?' అంటూ మోడీని ఉద్దేశించి శివప్రసాద్ ఫైర్ అయ్యారు.
మత్స్యకారుడి గెటప్:
ఇక గత శుక్రవారం నాడు మత్స్యకారుని వేషంలో పార్లమెంటుకు వచ్చారు శివప్రసాద్. చేతిలో వలతో నెత్తికి టోపీతో.. ఆ గెటప్ లో అచ్చు మత్స్యకారుడి లాగే కనిపించారాయన. పార్లమెంటు ఆవరణలో వల విసురుతూ.. మోడీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ.. రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సత్య హరిశ్చంద్రుడి గెటప్:
పార్లమెంటు సమావేశాల సందర్భంగా సత్య హరిశ్చంద్ర అవతారంలోనూ నిరసన తెలిపారు శివప్రసాద్. భుజంపై కుండ, చేతిలో కర్ర పట్టుకుని.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పద్యరూపంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్నహామీని నిలబెట్టుకోవాలని, ఈ విషయంలో జాప్యం చేయరాదని కేంద్ర పాలకులకు విజ్ఞప్తి చేశారు.
కోయదొరగా..:
కుర్రో.. కుర్రు.. అంటూ కోయదొర గెటప్ లోనూ శివప్రసాద్ నిరసన తెలిపారు.‘కుర్రో కుర్రు..కొండదేవర కుర్రో కుర్రు..చెప్పినమాట వినకపోతే పుర్రో పుర్రు..ఇందిరాగాంధీతో చెప్పినా..ఎన్టీఆర్తో పెట్టుకోవద్దని..చెప్పిన మాట వినలే..ఏమైంది? ఏమైందో మీకు బాగా తెలుసు...!! సోనియాగాంధీతో చెప్పినా..తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయవద్దని..చెప్పిన మాట వినలేదు. విభజన చేసింది. ఇప్పుడు ఆమె, ఆమె పార్టీ ఎన్ని బాధలు పడుతుందో మీకు బాగా తెలుసు. ఇప్పుడు మోడీ గారికి చెబుతున్నా..ఏం మోడీ గారూ.. మీకు మూడిందా ఏంది? అంటూ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు.
రైతు గానూ:
నిరసనల క్రమంలో భాగంగా రైతు గెటప్ లోనూ శివప్రసాద్ పార్లమెంటుకు వచ్చారు. 'మోడీ గారు ఎక్కడుంటారండీ..' పార్లమెంటు ఆవరణలో పలువురిని ఆరా తీస్తూ.. అమరావతి శంకుస్థాపన వచ్చిన ప్రధాని మట్టి - నీరు ఇచ్చారని.. ఇప్పడవి ఆయనకే తిరిగిచ్చేస్తామని ఎద్దేవా చేశారు.
ఫాదర్ గానూ:
ఇటీవలే చర్చి ఫాదర్ గెటప్ లోనూ శివప్రసాద్ పార్లమెంటు ఆవరణలో నిరసన తెలియజేశారు. చేతిలో బైబిల్ పట్టుకుని విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలతో కలిసి ఆందోళన చేశారు.
ఎన్టీఆర్ గెటప్:
టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ఎన్టీఆర్ గెటప్ లోనూ శివప్రసాద్ నిరసన తెలియజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని.. ఏపీకి అన్యాయం జరుగుతుందని.. ఎన్టీఆర్ శైలిలో డైలాగ్స్ చెప్పారు. ఎన్టీఆర్ వేషధారణలో ఆయన కనిపించడంతో పలువురు ఆయన్ను ఆసక్తిగా చూశారు.
పోతురాజుగా:
ఒక చేతిలో నిమ్మకాయ గుచ్చిన కొడవలి, రెండో చేతిలో కొరడా పట్టుకొని చొక్కా వేసుకోకుండా పోతురాజు వేషంలోనూ శివప్రసాద్ నిరసన తెలియజేశారు. మరోసారి తల వెంట్రుకలకు పిలక వేసుకొని.. దానికో రిబ్బన్ కట్టుకొని, మెడలో పూలమాల, కాళ్లకు గజ్జెలు ధరించి చేతిలో చిడతలు పట్టుకొని పార్లమెంట్ బయట పాటలు పాడుతూ నిరసన తెలిపారు.
శ్రీకృష్ణుడి వేషధారణలో:
శ్రీకృష్ణుడి వేషధారణలోనూ శివప్రసాద్ నిరసన తెలియజేశారు. ‘శ్రీకృష్ణ రాయబారం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. భారతంలో అదొక గొప్ప ఘట్టం. కౌరవులకు-పాండవులకు సంధి చేయడానికి శ్రీకృష్ణుడు చేసే ఉపదేశాలు అందులో చాలా ప్రధానమైనవి. అలాగే నేనూ కేంద్ర ప్రభుత్వానికి, మోదీగారికి ఈ వేషం ద్వారా హితవు చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హెచ్చరిక చేస్తున్నా.' అంటూ ఆ గెటప్ లో నిరసన తెలిపారు.