అమెరికాపైనా దెబ్బ: భారత్పై ట్రంప్నకెంత ప్రేమో...
క్లైమేట్ అకార్డ్ నుంచి వైదొలిగిన అమెరికాకే నష్టం: ట్రంప్పై ఒబామా నుంచి హాలీవుడ్ నటుల వరకు వెల్లువెత్తిన విమర్శలు
వాషింగ్టన్: భూతాప నివారణకు 2015 డిసెంబర్లో పారిస్ కేంద్రంగా జరిగిన సదస్సు తీర్మానాల అమలులో అంతర్జాతీయ సహకారం, బాధ్యతలను విస్మరించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయం ఆ దేశ ప్రతిష్ఠను దెబ్బతీయనున్నది.
ఫ్రాన్స్, జర్మనీ, ఫిన్లాండ్, తదితర ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో వివిధ ప్రపంచ దేశాలతో అమెరికా సంబంధాలు దెబ్బతింటాయి. చారిత్రక ఒప్పందం నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుబట్టారు.
పారిస్ ఒప్పందం ఖరారులో కీలక పాత్ర పోషించిన ఒబామా స్పందిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఒప్పందానికి అనుగుణంగా మార్పులను స్వీకరిస్తున్న తరుణంలో వైదొలగాలని అమెరికా తీసుకున్న నిర్ణయం తిరోగమన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో భవిష్యత్ను పోగొట్టుకున్న గుప్పెడు దేశాల సరసన అమెరికా చేరిందని పేర్కొన్నారు. హాలీవుడ్ నటులు ష్వార్జ్నెగ్గర్, డికాప్రియో, డెమోక్రటిక్ నేతలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
కట్టుబడి ఉంటామన్న కాలిఫోర్నియా, న్యూయార్క్ గవర్నర్లు
ప్రపంచదేశాల మధ్య విస్తృత సంప్రదింపుల తర్వాతే ఈ ఒప్పందం కుదరిందని, దాని నుంచి ఒకసారి వైదొలిగితే మళ్లీ చర్చలు అసాధ్యమని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. పారిస్ డీల్కు కట్టుబడి ఉండాలని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ట్రంప్ను ఫోన్లో కోరారు. ట్రంప్ నిర్ణయానికి నిరసనగా ఆ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, డిస్నీ రాబర్ట్ ఇగోర్ వైట్హౌస్ వాణిజ్య సలహామండలి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం అనైతికమన్న న్యూయార్క్, కాలిఫోర్నియా గవర్నర్లు.. తాము మాత్రం పర్యావరణ ఒప్పందానికి లోబడే వ్యవహరిస్తామని ప్రకటించారు.
ప్రపంచ నాయకత్వ స్వీకరణకు సిద్ధమన్న ఈయూ
ఐరోపా దేశాలు ఇక అమెరికాను విశ్వసించలేవని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ చేసిన వ్యాఖ్యలు ఐరోపా దేశాల వైఖరికి నిదర్శనంగా నిలిచాయి. అంతే కాదు అమెరికాలోని పునరుత్పాదక ఇంధన వనరుల రంగం దారుణంగా దెబ్బతినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పారిస్ ఒప్పందం అమలు నుంచి అమెరికా వైదొలిగినా.. ప్రపంచ పరిరక్షణ నాయకత్వం వహించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నదని యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు మార్కోస్ సెఫ్కోవిక్ పేర్కొన్నారు.
లక్షల కోట్ల డాలర్ల వ్రుథా ఖర్చని ట్రంప్ బాధ
భూతాప నివారణకు ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందాన్ని నీరుగార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్నారు. అత్యంత కీలకమైన పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలడం వల్ల ఆ ప్రభావం ఇతర దేశాలపైనా పడే ప్రమాదముంది. కర్బన ఉద్గారాల నియంత్రణకు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎటువంటి లబ్ది పొందకుండానే లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నదే డొనాల్డ్ ట్రంప్ అసలు బాధ. పారిస్ సదస్సు తీర్మానం నుంచి వైదొలుగుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పర్యావరణ సంస్థలు తీవ్రంగా మండిపడ్తున్నాయి. చారిత్రక తప్పిదం కాగలదని, ధరిత్రి ప్రేమికులందరికీ అంతర్జాతీయ విలన్గా అమెరికా నిలుస్తుందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
తప్పుకునేందుకు భారత్, చైనాలపై ట్రంప్ ఇలా
పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడానికి చైనా, భారత్లను బూచీగా చూపేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఆ రెండు దేశాలకు లబ్ధి చేకూర్చేందుకే క్రూరమైన పర్యావరణ ఒప్పందాన్ని రూపొందించారని ఆయన వ్యాఖ్యానించారు. క్లెమేట్ డీల్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని, ఉద్యోగ, ఉపాధి రంగాలను అది తీవ్రంగా దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. తమ దేశానికి నష్టం చేకూర్చే ఏ విషయంలోనైనా తమ వైఖరి ఇలాగే ఉంటుందని ట్రంప్ స్పష్టంచేశారు. తాను పిట్స్బర్గ్ ప్రతినిధినే కానీ పారిస్ ప్రతినిధిని కాదని చెప్పారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో పర్యావరణ పరిరక్షణకు పెనువిఘాతం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో అమెరికాది రెండోస్థానం కావడం గమనార్హం.
పారిస్ అకార్డ్ అమలులో భారత్, చైనా ఇలా
మరికొన్ని దేశాలు అమెరికా బాటలో సాగాలనుకుంటే ఈ ప్రతిష్ఠాత్మక ఒప్పందానికి తూట్లు పడినట్లే. కానీ, చైనా, భారత్ వంటి పెద్ద దేశాలు పారిస్ ఒప్పందానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని గట్టిగా చెబుతుండడం ఆశావహ పరిణామం. చైనా, భారత్ కూడా భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదల చేసే దేశాలే. ఇవి ఒప్పందాన్ని గౌరవించి కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే చర్యలు చేపడుతున్నాయి. భూతాపం విపరీతంగా పెరిగిపోవడంలో తమ పాత్ర పెద్దగా లేకున్నా వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఐరోపా దేశాలు, పసిఫిక్ ద్వీప దేశాలు.. దక్షిణ అమెరికా, ఆఫ్రికాల్లోని పేద దేశాలు ఈ ఒప్పందంపై గట్టి నమ్మకం పెట్టుకున్నాయి. అమెరికా నిష్ర్కమణతో సంబంధం లేకుండా అవన్నీ కొనసాగే అవకాశం ఉంది.
కర్బన ఉద్గారాల్లో ఐదో వంతు అమెరికాదే
పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగితే మిగతా ప్రపంచం.. కర్బన ఉద్గారాల నియంత్రణకు చేపడుతున్న చర్యల వేగం రెండు, మూడు రెట్లు పెంచాల్సి పరిస్థితి నెలకొన్నది. అంతర్జాతీయంగా ఏడాదిలో వెలువడుతున్న 5,400 కోట్ల టన్నుల గ్రీన్హౌస్ ఉద్గారాల్లో అయిదో వంతుకు పైగా అమెరికా నుంచి ఉద్గారమవుతున్నవే. 2030 నాటికి ఈ ఉద్గారాలను కనీసం 4,200 కోట్ల టన్నులకు పరిమితం చేయాలన్నది లక్ష్యం.. కానీ, అమెరికా వైపు నుంచి ఎలాంటి నియంత్రణ లేనప్పుడు ఆ లక్ష్యసాధన కష్టతరంగా మారబోతున్నది.
ట్రంప్కు ఇలా ఈయూ దేశాల రిటార్ట్
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగడానికి గల కారణాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాలుగు దేశాల నేతలకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ చెప్పినట్లు శ్వేతసౌధ వర్గాలు తెలిపాయి. జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మేక్రాన్, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని థెరెసామేలతో ట్రంప్ వ్యక్తిగతంగా ఫోన్చేసి మాట్లాడారు. అట్లాంటిక్ కూటమికి అమెరికా కట్టుబడి ఉందని, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన తాము తగిన నిర్ణయాలు తీసుకుంటామని వారికి ట్రంప్ వివరించారు. అయితే పారిస్ ఒప్పందానికి తాము కట్టుబడి ఉంటామని నాలుగు దేశాల అధినేతలు స్పష్టంచేశారు అని శ్వేతసౌధం వెల్లడించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ట్రంప్ వ్యతిరేకత ఇలా
భూవాతావరణాన్ని కలుషితం చేస్తున్న కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యంగా ప్రపంచ దేశాల మధ్య కుదిరిన అవగాహనే పారిస్ పర్యావరణ ఒప్పందం. ఈ ఒప్పందంలోని విధి విధానాలకు 2015 డిసెంబర్ 12న పారిస్లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న 195 దేశాలు ఆమోదం తెలిపాయి. 2016 ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం నాడు న్యూయార్క్లో సభ్యదేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ తర్వాత విడివిడిగా పలు దేశాల చట్టసభలు దీనికి అంగీకారం తెలుపుతూ చట్టాలు చేశాయి. గత ఏడాది నవంబర్ 4 నుంచి ఇది అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు అయింది. ఈ ఒప్పందంలో అంగీకరించిన అంశాల అమలుకు 2020 నుంచి సభ్యదేశాలు చర్యలు తీసుకోవాలి. నికరాగువా, సిరియాలు ఇందులో భాగస్వాములు కాలేదు. పారిస్ ఒప్పందాన్ని కార్యరూపంలోకి తేవటానికి గత ఏడాది వరకూ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒబామా విశేష కృషి జరిపారు. కానీ ఆయన స్థానంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి పారిస్ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.
అమెరికా వైదొలగడంతో చైనా, భారత్లపై అదనపు భారం
2025 నాటికి అమెరికా కర్బన ఉద్గారాలను 26 - 28 శాతానికి తగ్గించాలి. 2005 కంటే ముందు అమెరికాలో విడుదలైన కర్బన ఉద్గారాల స్థాయిని ప్రామాణికంగా తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. దీని ప్రకారం భూతాపానికి కారణం అవుతున్న కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, పెర్ఫ్లూరోకార్బన్స్, సల్ఫర్ హెగ్జాఫ్లూరైడ్, నైట్రోజన్ ట్రైఫ్లూరైడ్ లను తగ్గించాలి. అమెరికాలో వెలువడుతున్న కాలుష్యంలో 31 శాతం వాటా విద్యుత్ రంగానిదే. దీనికి ప్రత్యామ్నాయంగా పవన, సౌర విద్యుత్ వాటా పెంపొందించి.. ధర్మల్ విద్యుత్పై ఆధారపడటం తగ్గించి కాలుష్యానికి కళ్లెం వేయాల్సి ఉంటుంది. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం వల్ల భారీగా కాలుష్య కారకాలు విడుదల చేస్తున్న చైనా, భారతదేశం తదితర దేశాలపై అదనపు భారం పడనున్నది.
పవన, సౌర విద్యుత్ వినియోగానికి చైనా ఇలా
ప్రపంచ దేశాల్లో అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను విడుదలచేసిన చైనా.. పారిస్ ఒప్పందం తరువాత పర్యావరణ అనుకూల చర్యలను పెద్ద ఎత్తున చేపడుతున్నది. కాలుష్యం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న దేశమిది. ఇందులో భాగంగా గత ఏడాదిలోనే 100కి పైగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను రద్దు చేసింది. సౌర విద్యుత్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. శిలాజ ఇంధన వినియోగాన్నీ పరిమితం చేస్తోంది. విద్యుత్తో నడిచే వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.
అటవీ భూముల పెంపే ఇండియా టార్గెట్
పారిస్ ఒప్పందంలో భాగస్వామిగా మారిన భారత్ బాధ్యతాయుతంగా ఇప్పటికే పర్యావరణ రక్షణకు చర్యలు ప్రారంభించింది. అందుకు లక్ష్యాలు పెట్టుకున్నది. 2005 నాటి స్థాయితో పోల్చితే 2030 నాటికి 33 నుంచి 35 శాతం గ్రీన్హౌస్ ఉద్గారాలు తగ్గించాలన్నదే 2030 నాటికి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 40 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే ఉండాలని భారత్ ప్రథమ లక్ష్యం. 300 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను శోషించుకునే స్థాయిలో 2030 నాటికి అదనంగా అడవులు పెంచాలని మన దేశం లక్ష్యాలు ఏర్పరుచుకున్నది.
సభ్యదేశాల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్న ఈయూ
కాలుష్య నియంత్రణ కోసం కర్భన ఉద్గారాల విడుదల తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా ‘పారిస్ సదస్సు' భాగస్వాములైన ఆఫ్రికా, ఆసియా ఖండ దేశాలతోపాటు చైనా.. యూరప్ ఖండ దేశాలు తాము ఊహించిన దానికంటే అంచనాల కంటే ఎక్కువ సమర్థవంతంగా ప్రతిస్పందన లభిస్తున్నదని ఈయూ కమిషన్ కార్యదర్శి సెఫ్కోవిక్ తెలిపారు. భూతాప నివారణకు పునరంకితం అవుతూ యూరోపియన్ యూనియన్ (ఈయూ), చైనా సంయుక్త ప్రకటనపై సంతకాలు కూడా చేశాయి.