నోరు మెదపని బాబు, కేసీఆర్ షార్ప్ రియాక్షన్: తేడా ఇదే..
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఉన్నారు.. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగానూ, విపక్ష నేతగానూ అత్యధిక కాలం కొనసాగిన ఘనత ఆయన సొంతం. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్.. 1995 నుంచి 1999 వరకు ఉమ్మడి ఏపీలో రవాణాశాఖ మంత్రిగా, తర్వాత కొద్దికాలం డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు.
తర్వాత తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ స్థాపించారు. 2004 - 06 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కొద్దికాలం మినహా నాటి నుంచి అధికారానికి దూరంగానే ఉన్నారు. కానీ ఉద్యమ కాలంలో ప్రజలతో మాత్రమే మమేకమైనా.. వివేచనాస్ఫూర్తితో పాలనా పగ్గాలను వినియోగిస్తున్నారని బుధవారం హరిత హారం కార్యక్రమం సందర్భంగా వెలుగుచూసిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య వివాదంపై కేసీఆర్ అనుసరించిన విధానం తెలియజేస్తున్నది. మహిళా ఐఎఎస్ అధికారి ప్రీతిమీనాకు క్షమాపణ చెప్పాలని శంకర్ నాయక్ ను ఆదేశించడం ద్వారా తాను రాజనీతిజ్ణుడినని నిరూపించుకున్నారు సీఎం కేసీఆర్.
పాలకులు ఎల్లవేళలా అధికార యంత్రాంగాన్ని తమ కన్నుసన్నల్లో ఉంచుకోవాలని భావించడం కంటే వారి ఆలోచనలు, అభిప్రాయాలను, ఇబ్బందులు, సమస్యలకు కూడా ప్రాధాన్యం ఇస్తామన్న సంకేతం ఇస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి. అటు కాక అధికార పక్ష ఎమ్మెల్యేనో, ఎంపీనో సమర్థిస్తే.. అధికార యంత్రాంగం నిశ్చేష్టురాలిగా మారిపోతుంది. రోజువారీ విధుల నిర్వహణలో యాంత్రిక పనితీరుకే ప్రాధాన్యం ఇస్తుంది.
Recommended Video
క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ ఆదేశం
బహిరంగంగా ఒక జిల్లా కలెక్టర్గా ప్రీతిమీనా చేయి పట్టుకుని స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ (టీఆర్ఎస్) చేసిన తప్పు తీవ్రమైంది. ఆమె కనుసన్నల్లోనూ యావత్ జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుందన్న సంగతి విస్మరించి బెదిరింపులు, వేధింపులతో తమ మాట చెల్లించుకోవాలన్న రాజకీయుల దురాగతాలకు ఇది పరాకాష్ట. అందుకే సదరు ఎమ్మెల్యేను బహిరంగంగానే సీఎం కేసీఆర్ అభిశంసించారు. ప్రవర్తనసరిగా లేదని ఆ ఎమ్మెల్యేను మందలించడమే కాక.. కలెక్టర్ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పలేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. మహిళల పట్ల ఎవరు అమర్యాదగా ప్రవర్తించినా సహించేది లేదని కుండబద్దలు కొట్టారు.
రాజకీయ కుట్ర అని శంకర్ నాయక్ ప్రత్యారోపణ
అధికారుల ఆత్మగౌరవం, విలువ తెలిసిన విజ్ఞత గల నాయకుడు కావడం వల్లే ప్రభుత్వం తరఫున కలెక్టర్తో మాట్లాడి సముదాయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ చర్యతో అధికారుల ఆత్మగౌరవాన్ని అంబరాన్ని తాకింది. అధికారులతో దురుసుగా ప్రవర్తించే రాజకీయ నాయకులపైనా చర్యలు తప్పవని ఒక ఘాటైన సందేశాన్ని పంపారు. ఐఎఎస్ అధికారులు ఈ ఘటనను తీవ్రంగానే తీసుకున్నారు. ఎమ్మెల్యే వైఖరిపై చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు శంకర్ నాయక్ను అరెస్ట్ చేశారు. కానీ చేయాల్సిందంతా చేసి.. తనకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరిగిందని ఎదురుదాడికి దిగడం విచిత్రంగా ఉంది. ఇదిలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని ఒక్కసారి గమనిద్దాం..
ఎమ్మార్వో వనజాక్షికే సీఎం చంద్రబాబు చివాట్లు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిని ‘మహా భారతంలో దుశ్శాసనుడి' మాదిరిగా జుట్టు బట్టి ఈడ్చుకు వెళ్లినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. తమ సమస్యలను పరిష్కరిస్తారని సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లిన తహశీల్దార్ వనజాక్షినే చివాట్లు పెట్టి పంపారు. కానీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో క్షమాపణ చెప్పించడానికి కూడా చంద్రబాబు ప్రయత్నించలేదు.
ఒత్తిళ్లతోనే ఎంపీ కేశినేని క్షమాపణ
ఇటీవలే విజయవాడ నడిబొడ్డుపై రవాణాశాఖ కార్యాలయంలో ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం కాలర్ను అదే ప్రాంత ఎంపీ కేశినేని నాని పట్టుకున్నా పట్టుకున్నా పట్టించుకున్న వారు లేరు. కాకపోతే అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యానికి క్షమాపణ చెప్పారే తప్ప.. అప్పుడప్పుడు సకలింపులు చేస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం నోరు మెదపడం లేదు.
ప్రత్యేక విచారణ వ్యవస్థ ఏర్పాటుకు అభ్యర్థన ఇలా
మహారాష్ట్రతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఐఏఎస్లపై అధికార పార్టీ నేతలు, మాఫియా ఆగడాలు మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో హరితహారం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ వైఖరి బహిరంగమైనా.. ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీ నేతల వేధింపులకు ఐఏఎస్ అధికారులే ఇబ్బంది పడుతున్నారని తర్వాతీ పరిణామాల్లో తేలింది. ప్రీతిమీనా ఘటనతో అప్రమత్తమైన ఐఏఎస్ ల సంఘం పూర్తిస్థాయి పరిస్థితిని పరిశీలించింది. నలుగురు మహిళా ఐఏఎస్లు బాధితులుగా ఉన్నారని తేలింది. అన్ని చోట్లా అధికార పార్టీ నేతలే విలన్లుగా వ్యవహరిస్తున్నారని నిర్ధారణైంది. తన పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసు ప్రవర్తనపై సీనియర్ మహిళా ఐపీఎస్తో విచారణ చేయించాలని ప్రీతి మీనా విజ్ఞప్తి చేస్తే, విచారణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఐఏఎస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
సీఎస్ కు ఇలా ఐఏఎస్ అసోసియేషన్ ఫిర్యాదు
‘ఐఏఎస్ అధికారులమనే కనీస గౌరవం కూడా లేదు. అమర్యాదగా మాట్లాడుతున్నారు.. సంబోధించే పద్ధతి కూడా సరిగా ఉండటం లేదు. నువ్వు.. నువ్వు అంటున్నారు.. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక సాకు చూపించి తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు.. ఇదేం పద్ధతి..'అని మహిళా కలెక్టర్ ప్రీతిమీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను కలసి గోడు వెళ్లబోసుకున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా పట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ అసభ్య ప్రవర్తన వ్యవహారాన్ని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. మహబూబాబాద్లోనే కాక.. మరో ఐదు జిల్లాల్లోనూ ఇలాంటి దురదృష్టకర పరిస్థితులే ఉన్నాయని, కొందరు నాయకులు అదే పనిగా తమను వేధిస్తున్నారని పలువురు ఐఏఎస్ అధికారులు సీఎస్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
మెదక్ జిల్లాలో కలెక్టరేట్పై ఒత్తిళ్లు
జనగాం జిల్లాపై ఎక్కువ చర్చ జరిగినట్లు తెలిసింది. మెదక్ జిల్లాలో కలెక్టరేట్ స్థలానికి సంబంధించి అక్కడి అధికార పార్టీ నేత ఒకరు ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ఇసుక రవాణాపై ఇద్దరు నేతల నుంచి రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయినట్లు ఐఏఎస్ అధికారులు ఉటంకించారు. కరీంనగర్లోనూ అధికార పార్టీ నేతలు అనవసరమైన అంశాల్లో తలదూర్చుతున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.
ఒకచోట సీసీ రోడ్డు మంజూరు.. మరోచోట నిర్మాణం
ఒకవైపు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదం రగులుతుండగానే మెదక్ జిల్లా అందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ నోరు పారేసుకున్నారు. రేగోడ్ మండలం జగిర్యాల, కొండాపురం తదితర ప్రాంతాల్లో హరిత హారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే బాబు మోహన్.. పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రశేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేగోడ్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటడానికి వచ్చిన బాబూమోహన్కు, అం తకు ముందు మంజూరు చేసిన సీసీ రోడ్డు కనిపించలేదు. సీసీ రోడ్డు నిర్మించలేదా? ఎందుకంటూ పలువురిని ఆరా తీశారు. దానిని మరోచోట నిర్మించారని తెలిసింది. తాను ఇక్కడి సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తే మరోచోట వేయడం ఏమిటని ఏఈపై మండిపడ్డారు.