షాక్: అఖిలేష్ మంత్రుల్లో అత్యధికులు ఓటమి, బిజెపి సునామీలో ఎస్ పి కోటలకు బీటలు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అఖిలేష్ మంత్రివర్గంలోని మంత్రులంతా ఈ ఎన్నికల్లో ఒకరిద్దరూ మినహ చిత్తు చిత్తుగా ఓటమిపాలయ్యారు. బిజెపి ప్రభంజనంలో ఎస్ పి మంత్రుల్లో అత్యధికులు ఓటమిని మూటగట్టుకొన్నారు.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అఖిలేష్ మంత్రివర్గంలోని మంత్రులంతా ఈ ఎన్నికల్లో ఒకరిద్దరూ మినహ చిత్తు చిత్తుగా ఓటమిపాలయ్యారు. బిజెపి ప్రభంజనంలో ఎస్ పి మంత్రులంతా ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.ఎస్ పి కి గట్టి పట్టున్న నియోజకవర్గాలు కూడ ఈ దఫా బీటలు వారాయి.కమల వికాసం సమాజ్ వాదీ పార్టీ సైకిల్ ను పంక్చర్ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల్లో పోటీచేసింది. ఈ ఎన్నికల్లో ఎస్ పి, కాంగ్రెస్ పార్టీ కూటమి వందలోపు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకొంది.
అయితే చాలా కాలం తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తన అధికారాన్ని కైవసం చేసుకొంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా చాల కాలం నుండి ఆ పార్టీ చేసిన కృషి పలించింది. ఈ మేరకు బిజెపికి ఊహించిన దాని కంటే ఎక్కువ స్థానాలు దక్కాయి.
అఖిలేష్ మంత్రుల్లో అత్యధికులు ఓటమి
అఖిలేష్ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో అత్యధికులు ఓటమిపాలయ్యారు.అఖిలేష్ మంత్రివర్గంలో మూడొంతుల మంది చిత్తు చిత్తుగా ఓటమిపాలయ్యారు. అఖిలేష్ కు సన్నిహితులుగా ఉన్న మంత్రులు అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రాలు కూడ ఓడిపోయారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి ప్రజాపతి ఆమేథీ స్థానం నుండి పోటీచేశారు.ఆయన కూడ ఓటమిపాలయ్యారు.రవీంద్ర మెహోత్రా, శివకాంత్ ఓఝా, జియాద్దునీ రిజ్వీ, అద్వైష్ ప్రసాద్, వినోద్ కుమార్ అలియాక్, పండిత్ సింగ్, రామ్మూర్తి వర్మ, శంకలాల్ మాంఝీ, రామ్ కరణ్ ఆర్య,బ్రహ్మశంకర్ త్రిపాఠీ, కమల్ ఆక్తర్,రియాజ్ అహ్మద్ తదితరులు బిజెపి చిత్తు చిత్తుగా ఓటమిపాలయ్యారు.
బిజెపి ప్రభంజనంలో గెలిచిన అఖిలేష్ క్యాబినెట్ మంత్రులు
ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితుడు రాంపూర్ నుండి పోటీచేసిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ ఈ ఎన్నికల్లో విజయం సాధించాడు.రాంగోవింద్ చౌదరి, ప్రశాంత్ యాదవ్, దుర్గా ప్రసాద్ యాదవ్, యాసిర్ షా, మహబూబ్ అలీ, ఇక్బాల్ మహ్మద్, రఘురాజ్ ప్రతాప్ సింగ్ , మనోజ్ కుమార్ , నరేంద్ర సింగ్ వర్మలు ఈ ఎన్నికల్లో బిజెపి ప్రభంజాన్ని కూడ తట్టుకోని విజయం సాధించారు.ఆజంఖాన్ కొడుకు కూడ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
సమాజ్ వాదీ కోటలకు బీటలు
సమాజ్ వాదీ పార్టీ కోటలకు ఈ ఎన్నికల్లో బీటలు వారాయి. సమాజ్ వాదీ పార్టీ ఏర్పాటైన నాటి నుండి ఓటమి లేకుండా ఉన్న స్థానాల్లో కూడ ఈ దఫా ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కనౌజ్ పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. అయితే జశ్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసిన శివపాల్ యాదవ్ తన సమీప బిజెపి అభ్యర్థి మనీష్ యాదవ్ పై 52 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ములాయం చిన్న కోడలు అపర్ణయాదవ్ రీటా బహుగుణ చేతిలో ఘెోర పరాజయం పాలయ్యారు.ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కేవలం 47 స్థానాలకే పరిమితమైంది.కాంగ్రెస్ పార్టీ కేవలం 7 సీట్లకే పరమితమైంది.
బిజెపి సునామీ ముందు పనిచేయని పార్టీల వ్యూహలు
ఈ ఎన్నికల్లో బిఎస్ పి కి మరింత దెబ్బతింది. దళితులు, మైనార్టీల మద్దతుతో అధికారాన్ని చేపట్టాలని బిఎస్ పి వ్యూహరచన చేసింది.అయితే 2007 ఎన్నికల్లో బిఎస్ పి అనుసరించిన ఫార్మూలా పనిచేసింది..కాని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అనుసరించిన ఫార్మూలా దెబ్బకొట్టింది. 2012 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకొంది.కాని, ఈ దఫా కేవలం 19 సీట్లకే ఆ పార్టీ పడిపోయింది.