గీతకు జగన్ చిక్కు: రాహుల్ మహిళా సిఎంలు వీళ్లే
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం హైదరాబాదులోని సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రాంత మహిళా నేతల్లో ఆశలు చిగురించేలా చేశాయి! కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే మహిళా నేతను ముఖ్యమంత్రి చేస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
దీంతో ఇప్పుడు ఈ రేసులో ఉన్న వారిపై చర్చ సాగుతోంది. ప్రధానంగా మాజీ మంత్రులు డికె అరుణ, గీతా రెడ్డి, సునిత లక్ష్మా రెడ్డి తదదితరులు ఉన్నారు.
రాహుల్ ప్రకటన వెనక రాజకీయ చాతుర్యం, వ్యూహం దాగి ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిని కొత్త రాజకీయ ఎత్తుగడగా అభివర్ణిస్తున్నాయి.
రాహుల్ గాంధీ
తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రాంతానికి మహిళను ముఖ్యమంత్రిగా చేస్తామని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు.
దామోదర రాజనర్సింహ
తెలంగాణలో దళితుడే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమే కాకుండా దామోదర రాజనరసింహను తెలంగాణలో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమించడంతో కాంగ్రెస్కు మెజారిటీ వస్తే ఆయనే ముఖ్యమంత్రి అన్న ఊహాగానాలు అప్పట్లో చెలరేగాయి.
గీతా రెడ్డి
ఇప్పుడు రాహుల్ ప్రకటనతో కాంగ్రెస్ మహిళా నేతల్లో ఆ పదవికి అర్హులు ఎవరన్న చర్చ మొదలైంది. జహీరాబాద్ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రి జె గీతారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఆమె విజయం సాధించి.. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే ఆమెకే సిఎం పదవిని చేపట్టే అవకాశం లభిస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. తద్వారా ద్విముఖ వ్యూహాన్ని అమలు చేసినట్లు అవుతుందని అంటున్నారు.
జైరాం రమేష్
దళిత వర్గానికి చెందిన మహిళను చవఎం చేయడం ద్వారా జైరాం, రాహుల్ ప్రకటనలకు న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు గీతారెడ్డికి అడ్డంకిగా మారుతుందేమోనన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
డికె అరుణ
గీతా రెడ్డికి గద్వాల నుంచి పోటీ చేస్తోన్న డికె అరుణ పేరు తెరపైకి వస్తోంది. మహబూబ్నగర్ జిల్లాలో సమర్థ నాయకురాలిగా అరుణకు మంచి పేరుంది.
సునిత లక్ష్మా రెడ్డి
అదే సమయంలో నర్సాపూర్ నుంచి బరిలో ఉన్న సునీతా లక్ష్మారెడ్డి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సునీత.. మరో దఫా విజయంపై కన్నేశారు.