ఫిబ్రవరి 9న అసలు 'జేఎన్యూ'లో ఏం జరిగింది?
హైదరాబాద్: గత వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరుగుతున్న వివాదానికి స్వస్తి చెప్పే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తోంది. పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా తేలిన అప్జల్గురు ఉరితీతకు మద్దతుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఓ ప్రొఫెసర్ నేతృత్వంలో విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది.
ఇక ఈ ఘటనలు కేవలం విద్యార్థుల తొందరపాటు తప్పిదమా? లేక ముష్కర మూకలకు ఆశ్రయమిస్తున్న విదేశాల కుట్ర ఉందా? అన్న కోణంలో విచారణను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంతో ఇప్పటికే కొందరు విద్యార్థులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉండవచ్చన్న ఊహాగానాలు రావడంతో, ఆ దిశగా నిజాన్ని తేల్చేందుకు ఢిల్లీ పోలీసుల కోరిక మేరకు ఎన్ఐఏ, ప్రత్యేక సిట్ రంగంలోకి దిగాయి.
వర్శిటీలో జరిగిన ఘటనల వెనకున్న అసలు కారణాన్ని విచారిస్తున్నామని మంగళవారం ఉదయం ఢిల్లీ హైకోర్టులో అరెస్టయిన వారికి బెయిలివ్వాలంటూ వచ్చిన పిటిషన్లపై విచారణ సందర్భంగా కేంద్రం పేర్కొంది. ఈ కేసులో మొత్తం ఏడుగురిని సస్పెండ్ చేయగా, కన్నయ్య కుమార్ అనే విద్యార్థిని అరెస్ట్ చేశారు.
మరోవైపు జేఎన్యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పోలీసులకు ఆదేశించారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని తాము సహించమని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తాను పోలీసు అధికారులకు సూచించినట్లు రాజ్నాథ్సింగ్ వెల్లడించారు.
గత బుధవారం న్యూఢిల్లీలోని ప్రెస్క్లబ్లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ జాఫర్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అలీ జాఫర్ బృందంలోని కొందరు ‘కాశ్మీర్ లేకర్ రెహెనేజ్', ‘అఫ్జల్ గురు అమర్ రహే' అంటూ దేశ వ్యతిరేక, ఉగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేశారు. అంతేగాక, అఫ్జల్ గురు చిత్రాలను కూడా అక్కడ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్కు పిసిఐ షోకాజు నోటీసులు పంపింది.
అయితే, తన బృందంలోని కొందరు ఇలా నిరసనలు వ్యక్తం చేస్తారని తనకు తెలియని చెప్పారు ప్రొఫెసర్. ‘నా దృష్టికి వచ్చిన వెంటనే నినాదాలు చేయొద్దని వారించా. కానీ, వారు వినలేదు' అని మీడియాతో జాఫర్ చెప్పడం గమనార్హం. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిపిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం జరిగింది.