ఎవరు అసలు లీడర్?: ఆనందీబెన్ పటేల్ వర్సెస్ అమిత్ షా
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ లేఖ రాశారు. కానీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె క్రియాశీల పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.
గాంధీనగర్/ న్యూఢిల్లీ: మరో రెండు నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ముహూర్తం ఖరారు చేయనున్నది. పాటిదార్ల ఆందోళన, క్షత్రియుల హక్కుల పోరాటం, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దిశానిర్దేశం చేయనున్నాయి.
ప్రత్యేకించి పటేళ్ల రిజర్వేషన్ పోరాటం అధికార బీజేపీలో కుమ్ములాటలకు దారి తీసిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పటేళ్ల ఆందోళనకు తోడు 'ఉనా'లో దళితులపై దాడికి నిరసనగా హోరెత్తిన ఆందోళన సాకుతో మోదీ తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆనందీబెన్ పటేల్ను అనధికార '75 ఏళ్ల నిబంధన' పేరిట తప్పించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. తన అనుచరుడైన విజయ్ రూపానీని సీఎంగా నియమించారని వార్తలు వచ్చాయి.
అయితే విజయ్ రూపానీకి దూకుడుగా ముందుకు వెళ్లేందుకు చొరవ చూపే సామర్థం లేదని చెప్తున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాల్సి రావడంతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 'గుజరాత్ అభివ్రుద్ధి మోడల్' నినాదం వినిపిస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయబోనని అమిత్ షాకు లేఖ
అంతర్గతంగానూ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ నుంచి బీజేపీ నాయకత్వానికి తలనొప్పులు ఎదురవుతున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఆనందీబెన్ పటేల్ బహిరంగ లేఖ రాశారు. కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరారు. అసలు సంగతేమిటంటే ఇటీవలి కాలంలో ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ కంటే ఆనందీబెన్ పటేల్ పట్ల ప్రజల్లో ఆదరణ క్రమంగా పెరుగుతున్నదని వార్తలొస్తు్నాయి. ఈ క్రమంలో పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై విభేదాలకు తావు లేకుండా ఉండేందుకు ఆనందీబెన్ పటేల్తో సంప్రదింపులు జరిపారు. బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి ట్వీట్ ప్రకారమే విజయ్ రూపానీ కంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఆనందిబెన్ పటేల్ పేరుకు క్రమంగా బలం పెరుగుతున్నది. ఆమెకు సారథ్యం అప్పగిస్తే గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
గుజరాతీల ప్రేమాభిమానాలు గెలుచుకున్న మాజీ సీఎం
ఈ క్రమంలో తాను పోటీ చేయబోనని ఆనందీబెన్ చేసిన ప్రకటన నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తరఫున ఎవరు నాయకత్వం వహిస్తారన్న సంగతి, ఆ పార్టీలో అసలుసిసలు నాయకులు ఎవ్వరన్న సంగతి కమలనాథుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నది. చోర్యాసీ ఎమ్మెల్యే జంఖానా పటేల్ మాటల్లో చెప్పాలంటే.. సీఎం అభ్యర్థిని బీజేపీ నాయకత్వం ఖరారు చేస్తుందని, కానీ ఆనందీబెన్ పటేల్ కెపాసిటీ ఏమిటో రుజువు చేసుకున్నారని చెప్పారు. పరిపాలనా దక్షురాలిగా పేరు కూడా తెచ్చుకున్నారని జంఖానా పటేల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గుజరాతీలంతా ఆమెను ప్రేమిస్తారని, అభిమానిస్తారని అంటున్నారు. ఆమెకు ఎన్నికల సారథ్య బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి లబ్ది చేకూరుతుందని జంఖానా పటేల్ పేర్కొన్నారు. అసలు సంగతేమిటంటే మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్కు అత్యంత సన్నిహితురాలని మీడియాలో వార్తలొచ్చాయి.
అమిత్ షా, ఆనందీబెన్ మధ్య బీజేపీ నేతల చీలిక
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహచరుడు.. సూరత్ కేంద్రంగా పని చేస్తున్న బీజేపీ నేత రాజు పాఠక్.. చోర్యాసీ టిక్కెట్ ఆశిస్తుండటంతో జంఖానా పటేల్ తన వైఖరేమిటో బయట పెట్టారు. అంతే కాదు రాజు పాఠక్.. సూరత్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం.. పేరొందిన సుముల్ డెయిరీ చైర్మన్గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చోర్యాసీ స్థానానికి అభ్యర్థెవరో పోటీ చేస్తారో పార్టీ నిర్ణయిస్తుందని రాజు పాఠక్ పేర్కొనడం గమనార్హం. పార్టీ నాయకత్వం అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తానన్నారు. చోర్యాసీ మాదిరిగా బీజేపీలో ఇద్దరు నేతలు టిక్కెట్లు ఆశిస్తున్న స్థానాలు భారీగానే ఉన్నాయి. టిక్కెట్ ఆకాంక్షాపరుల్లో ఒకరు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు సన్నిహితులైతే, మరొకరు మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ వర్గంలో ఉండటం ఆసక్తికర పరిణామం. సుమారు 50 సీట్లలో ఈ సమస్య తలెత్తిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
అభ్యర్థుల ఖరారులోనూ ఆనందీబెన్ పాత్ర కీలకం ఇలా
50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంతంగా బీజేపీ నేతలు మేనేజ్ చేసుకునే పరిస్థితి లేదని ఆ నాయకుడు తెలిపారు. ఇప్పటివరకు గుజరాత్ బీజేపీ వ్యవహారాల్లో అమిత్ షా కీలక నిర్ణయాధికారం కలిగి ఉన్నారన్నది వాస్తవం. కానీ ఆనందీబెన్ పటేల్తో అమిత్ షా భేటీ కావడం గుజరాత్ బీజేపీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పాటైందన్న సంకేతం పార్టీ శ్రేణుల్లోకి వెళ్లిందని ఆ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారు చేయడంలోనూ ఆనందీబెన్ పటేల్ ప్రధాన పాత్ర పోషించనున్నారు.
ఈ సమస్యను తేలిగ్గానూ, త్వరితగతిన బీజేపీ నాయకత్వం పరిష్కరించుకోకపోతే మాత్రం.. ఎన్నికల ఫలితాలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందంటున్నారు. ఒకవేళ ఆనందీబెన్ పటేల్ పవర్ సెంటర్గా ఎదిగితే మాత్రం ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ సరైన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గుజరాతీలు విజయ్ రూపానీని సీఎంగానే గుర్తించలేదని చెప్తున్నారు. విజయ్ రూపానీ సీఎం అయినా.. అమిత్ షా ప్లస్ ఆనందీబెన్ పటేల్ కలిసి ఆయనను పక్కకు నెట్టివేశాయని పరిశీలకులు తెలిపారు.