నితీశ్ సూచనకు కాంగ్రెస్ సరే: రాష్ట్రపతి ప్రణబ్కు రెండో చాన్స్?
వచ్చే నెలలో రాఫ్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ వారసుడి ఎన్నికకు నోటిఫికేషన్ షెడ్యూల్ వెలువడనున్నది. జూలై 25వ తేదీన నూతన రాష్ట్రపతి కొలువు దీరనున్నారు.
న్యూఢిల్లీ: వచ్చే నెలలో రాఫ్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ వారసుడి ఎన్నికకు నోటిఫికేషన్ షెడ్యూల్ వెలువడనున్నది. జూలై 25వ తేదీన నూతన రాష్ట్రపతి కొలువు దీరనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మరో విడత దేశాధినేతగా కొనసాగే అవకాశమివ్వాలన్న బీహార్ సీఎం నితీశ్కుమార్ సూచనకు కాంగ్రెస్ సానుకూలంగానే స్పందించింది.
రాష్ట్రపతి అందుకు అంగీకరిస్తే తాము మద్దతిచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసే విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంతనాలు జరిపారు.
అఖిలపక్ష ఉమ్మడి అభ్యర్థిగా ప్రణబ్ను నిలబెట్టేందుకు బీజేపీ సంప్రదింపులు ప్రారంభించాలని బీహార్ సీఎం నితీశ్కుమార్ సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం ముందుకు వస్తే మంచిదని కూడా వ్యాఖ్యానించారు. అయితే మాజీ కాంగ్రెస్ వాది అయిన ప్రణబ్ ముఖర్జీ మాత్రం ప్రభుత్వం నామినేట్ చేస్తేనే రెండో విడత గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.
అద్వానీపై మోదీ ఇలా
ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయాలు సాధించిన ఉత్సాహంలో ప్రధాని నరేంద్రమోదీ.. తన సొంత రాష్ట్రంలో సోమనాథ్ దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ తనకు గురువు వంటి వారని, ఆయనకు గురు దక్షిణ సమర్పించుకుంటానని ప్రకటించడంతో తదుపరి రాష్ట్రపతి అద్వానీయే అని అంతా అనుకున్నారు. కానీ అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులకు ఆ అవకాశం లేదని తర్వాత పరిణామాల్లో గానీ తేలలేదు. అద్వానీ అభ్యర్థిత్వానికి మద్దతు తెలియజేస్తానని గతంలో ప్రకటించిన మమతాబెనర్జీ తర్వాత మనస్సు మార్చుకున్నారు. ఇంకోకవైపు శారదా, నారదా కేసుల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని త్రుణమూల్ కాంగ్రెస్ నేతలపై కేసులు.. బీజేపీతో బెంగాల్ ప్రభుత్వం ఘర్షణ క్రమంగా పెరుగుతోంది.
అద్వానీ తదితరులపై కేసు నమోదు చేయాలని సుప్రీం ఆదేశం
కానీ నాటి నుంచే జాతీయ రాజకీయాల్లో వ్యూహాలు మారిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, ఆ పార్టీ నాయకులకు దన్నుగా ఉంటూ వచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని నేరుగా బీజేపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన ఎల్ కే అద్వానీతోపాటు సీనియర్ మురళీ మనోహర్ జోషి, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, కేంద్రమంత్రి ఉమా భారతి తదితరులపై అభియోగాలు నమోదు చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ‘సుప్రీంకోర్టు' ఆదేశించింది. దీంతో రాష్ట్రపతి పదవికి అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారి పేర్లను బీజేపీ నాయకత్వం.. దానికి మించి ఆ పార్టీ మార్గదర్శి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పరిశీలించడం లేదని తేలిపోయింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి నిలిపేందుకు యత్నాలు
ఈ లోగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా విపక్ష నాయకులు సమాయత్తం అయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించారు. సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. విపక్ష నాయకులతో లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులతో సంప్రదింపులు వేగవంతం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలపడం ద్వారా మోదీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని, 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచి విపక్షాల్లో ఐక్యత కోసం పని చేయాలని శ్రీకారం చుట్టారు. ఈ దశలోనే రెండోసారి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి ఏకాభిప్రాయం తేవాలని ప్రధాని నరేంద్రమోదీని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కోరారు.
లాలూ, చిదంబరం ఇళ్లపై ఐటీ, సీబీఐ దాడులు
సోనియాతో భేటీ తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ బీహార్ లో మాదిరిగానే జజాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటుకు పిలుపునిచ్చారు. దీనికి కమ్యూనిస్టులతోపాటు జనతా పరివార్ నేతలంతా దాదాపు అంగీకరించారు. ఈ దశలో బినామీ ఆస్తుల పేరిట లాలూ, ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల ఇండ్లపైనా, కార్యాలయాలపై ఆదాయం పన్నుశాఖ అధికారుల దాడులు చేయడం గమనార్హం. ఇటు తమిళనాట కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇంటిమీద సీబీఐ దాడులు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పత్రికల్లో చిదంబరం వార్తాకథనాలు రాయడమేనని స్వయంగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చెప్పారు. ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇటువంటి దాడులు తననేం చేయలేవని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
మోదీ మెతక వైఖరి ప్రదర్శిస్తారా?
రాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ కాలేజీలో అధికార పక్షానికి సుమారు 24 వేల ఓట్ల తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి శివసేన అనునిత్యం, బీజేపీపై, నరేంద్రమోదీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నది. ఇంకొకవైపు మమతాబెనర్జీ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీలతో సమావేశం అయి విపక్షాల మధ్య ఐక్యతకు పెద్ద పీట వేశారు. ఈ తరుణంలోనే ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపాలని ప్రధాని మోదీని బీహార్ సీఎం నితీశ్ కుమార్ సూచించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం ద్వారా తదుపరి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీని తిరిగి ఎన్నిక చేసే అవకాశాలు ఉన్నాయా? అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ మోదీ వ్యవహార శైలి గురించి తెలిసిన వారెవ్వరూ విపక్షాలు.. ప్రత్యేకించి మాజీ కాంగ్రెస్ వాదిగా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిగా కొనసాగించడం అనుమానమేని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటివరకు బాబూ రాజేంద్ర ప్రసాద్ మినహా మిగతా వారెవ్వరూ రెండోసారి రాష్ట్రపతిగా పని చేయక పోవడం గమనార్హం.