మోడీ సభలో చేరిక: రజనీకాంత్ వస్తారా?(పిక్చర్స్)
2014 లోకసభ ఎన్నికలలో మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పలువురు ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించింది. ఇంకొందరిని పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆహ్వానిస్తోంది. ఇమేజ్ కలిగిన వారిని తమ పార్టీలోకి తీసుకు వచ్చి గుంపగుత్తగా ఓట్లు పొందాలని చూస్తోంది.
గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలు ఆంధ్ర ప్రదేశ్లోని హైదరాబాదు నుండి గత నెల ప్రారంభించారు. తన సభలలో ఆయా రాష్ట్రానికి లేదా స్టార్ కంపెయిర్గా భావిస్తున్న వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. హైదరాబాదు సభలో తెలంగాణపై ఉద్యమిస్తున్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు.
రాజస్థాన్లో జరిగిన ర్యాలీలో ప్రముఖ షూటర్, 2004 ఒలింపిక్ రజత పతక విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, జైపూర్ రాజకుటుంబానికి చెందిన దివ్యా సింగ్లు పార్టీలో చేరారు. హర్యానాలో జరిగిన మాజీ సైనికుల ర్యాలీలో వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేలకు కూడా గాలమేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ పార్టీ నేతలు వారిని పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. కుంబ్లేను బెంగళూరు దక్షిణ నుండి పోటీలోకి దింపే యోచనలో కూడా ఉన్నారట. రజనీకాంత్ను తమిళనాడు బిజెపి వర్గాలు మోడీ సూచనల మేరకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయట. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో తమిళనాడులో జరిగే మోడీ సభకు రజనీ హాజరవుతారా అనే చర్చ సాగుతోంది. రజనీకి ఒప్పించేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే, రాజకీయాలకు దూరంగా ఉండే రజనీకాంత్ పార్టీలకు మద్దతిచ్చే అవకాశాలు లేవని మరికొందరు చెబుతున్నారు.
నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ 2014 ఎన్నికలలో పార్టీ మెజార్టీ సీట్లు సాధించేందుకు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.
రజనీకాంత్
తమిళనాడు బిజెపి వర్గాలు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ను పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో తమిళనాడులో జరిగే మోడీ సభకు సూపర్ స్టార్ హాజరు అవుతారా అనే చర్చ సాగుతోంది.
అనిల్ కుంబ్లే
మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేను కర్నాటకలోని బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుండి లోకసభకు పోటీ చేయించి లబ్ధి పొందాలనే యోచనలో బిజెపి ఉందంట.
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
ఉత్తరాధిన మోడీ మానియా బాగా ఉంది. దీనిని మరింత క్యాష్ చేసుకునేందుకు ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రాజస్థాన్లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, జైపూర్ రాజకుటుంబానికి చెందిన దివ్యను పార్టీలో చేర్చుకున్నారు.
నాగం జనార్ధన్ రెడ్డి
మోడీ తన ఎన్నికల ప్రచార సభల్లో, ర్యాలీలలో పలువురు ప్రముఖులను పార్టీలో చేర్చుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న నాగం జనార్ధన్ రెడ్డిని హైదరాబాదు సభలో, రాజ్యవర్ధన్, దివ్యలను జైపూర్ ర్యాలీలో పార్టీలో చేర్చుకున్నారు.