సోనియాకు చెప్పడమేంటి, షర్మిల ఏమైనా చేస్తుంది, భారతికి ఆ ఆలోచన లేదు: జగన్
Recommended Video
అమరావతి: జగన్ ప్రజా సంకల్ప యాత్ర బుధవారానికి నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావుకు ఇచ్చి న ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన తండ్రి వైయస్ మృతి తర్వాత జరిగిన పరిస్థితులను వివరించారు.
వైయస్ అవినీతి, పీఆర్పీ విలీనం, పోలవరం టూర్: నీలో విషయం లేదని పవన్కు జగన్ ప్రశ్నలు
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఏర్పడిన వివాదానికి గల కారణాలను చెప్పారు. సోనియా తన ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని చెప్పారు. ఆమెకు తన గురించి లేనిపోనివి చెప్పారో లేక ఆమె మైండ్సెట్ మారిందో తెలియదు కానీ ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి ఇవ్వలేదన్నారు.
నేను ఓదారుస్తానంటే సోనియా ఏం చెప్పారంటే
పాదయాత్రకు ఉన్న సెంటిమెంటును, దానితో తనకు ఉన్న ఎమోషనల్ కనెక్ట్ను ఆమె అర్థం చేసుకోలేకపోయారని జగన్ చెప్పారు. తాను, తన తల్లి విజయమ్మ, పాప ముగ్గురం కలిసి చివరిగా ఆమెను బతిమాలి ఒప్పించాలని వెళ్లామని, అయితే ఎంత చెప్పినా వినలేదన్నారు. అందరినీ ఒకే చోటకు పిలిపించి ఓదార్చండి అన్నారని చెప్పారు.
అసలు ఆమె పర్మిషన్ ఎందుకు
సోనియా కనుక ఆరోజు ఒప్పుకుని ఉంటే సమస్య ఇంతదూరం వచ్చి ఉండేది కాదని జగన్ చెప్పారు. తాము ముగ్గురం కలిసి సోనియాను పర్మిషన్ ఇవ్వమని మాత్రమే అడిగామన్నారు. అసలు ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి ఎందుకు తీసుకోవాలో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చేందుకు ఇంకొకరి అనుమతి కావాలనుకోవడమే పెద్ద ఆశ్చర్యం అన్నారు.
ప్రజలు నమ్ముతున్నారు
సోనియా ఒప్పుకోకపోయినప్పటికీ తాను మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నిర్ణయించుకున్నానని, జగన్ చెప్పారు. ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పానని అన్నారు. జనం కష్టాలు తెలుసుకొని భరోసా ఇచ్చేందుకే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నానని జగన్ చెప్పారు. జగన్ వస్తే కష్టాలు పోతాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
ఎన్నికల నాటికి జగన్ మిగులుతాడని టీడీపీ అనడంపై
ఎన్నికల నాటికి వైసీపీలో జగన్ ఒక్కడే మిగులుతారని వ్యాఖ్యానించడంపై జగన్ స్పందించారు. అది మూర్ఖత్వం అన్నారు. నేను పార్టీ పెట్టినప్పుడు అమ్మ, నేను ఇద్దరమే అని, అప్పుడు తమది ఒక్కటే అసెంబ్లీ సీటు అని, ఇప్పుడు తమ వెంట ఎంతోమంది ఉన్నారని చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఇది ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. వాళ్లు ఎమ్మెల్యేలను కొంటూ తమపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ప్రజలే నాయకులను తయారు చేస్తారన్నారు.
నంద్యాల ఫలితంపై జగన్
నంద్యాల ఉపఎన్నికల ఫలితంపై మాట్లాడుతూ.. అక్కడ అధికార పార్టీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేల వరకు పంపిణీ చేసిందని చెప్పారు. చంద్రబాబుకు ఓటు వేయకుంటే పింఛన్, బియ్యం రావని చెప్పారని, బెదిరించి ఓటేయించుకున్నారని అభిప్రాయపడ్డారు. అయితే ఉప ఎన్నికకు సాధారణ ఎన్నికకు తేడా ఉంటుందన్నారు.
బీజేపీతో కలవడంపై, షర్మిల రాజకీయంపై
తాను బీజేపీతో కలుస్తానని వారే ప్రచారం చేస్తున్నారని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే తాను బీజేపీతో ఉంటానని చెబుతున్నానని అన్నారు. హోదా ఇవ్వకుండా ఎవరితోను వెళ్లమని చెప్పారు. మోడీతో కూడా ఇదే చెప్పానని తెలిపారు. వారు హోదా ఇస్తే కలుస్తామన్నారు. ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. తన సోదరి షర్మిల, అమ్మ విజయమ్మ నాకోసం ఏమైనా చేస్తారని చెప్పారు. వాళ్లేమీ రాజకీయాల్లో ఉండాలని అనుకోలేదన్నారు. తనను అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు నాకు తోడుగా నిలబడ్డారని తెలిపారు. తన భార్యకు, తన చెల్లికి, తన అమ్మకు పదవీ వ్యామోహం లేదన్నారు.