ఏం జరిగింది?: సెల్ఫీ సరదా, ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులను పొట్టనబెట్టుకుంది
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం ధర్మసాగర్ రిజర్వాయర్ను వెళ్లిన ఐదుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడి గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వరంగల్లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్ధులు రిజర్వాయర్ సందర్శనకు వచ్చారు.
రిజర్వాయర్ సందర్శనలో భాగంగా సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్న పత్తి శ్రావ్యారెడ్డి, పొల్లినేని వినూత్న, కర్నె శివసాయి, పొలినేని శివసాయికృష్ణా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. దీనిని గుర్తించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ రాజయ్య ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. హుటాహుటిన శ్రావ్యరెడ్డి మృతదేహాన్ని ఈతగాళ్లు వెలికి తీశారు. రిజర్వాయర్ సందర్శనకు మొత్తం ఆరుగురు విద్యార్ధులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు గల్లంతయ్యారు.
ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతయ్యారని విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. గల్లంతైన ఐదుగురి విద్యార్ధుల మృతదేహాలను సాయంత్రానికి వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్కు అతి సమీపంలో ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్ మంచి పర్యాటక ప్రాంతంగా పేరుంది.
అసలేం జరిగింది?
ధర్మసాగర్ రిజర్వాయర్లో పడి చనిపోయిన విద్యార్థుల విషయంలో కొత్త వాస్తవం వెలుగు చూసింది. ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్ధుల మృతి చెందడానికి కారణం సెల్ఫీ మోజు అని తెలుస్తోంది. కేవలం సెల్ఫీ తీసుకోవాలనే సరదాతోనే అక్కడి వరకు వెళ్లారని స్థానికులు చెబుతున్నాదాని బట్టి తెలుస్తోంది.
వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజిలో మూడో సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సరదాగా కబుర్లు చెప్పుకుందామని కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్కు వచ్చారు. టూరిస్ట్ స్పాట్గా రిజర్వాయర్కు పేరుంది. అయితే సాధారణ పర్యాటకులు వెళ్లే ప్రాంతానికి కాకుండా కొంచెం దూరంగా ఉండే ప్రాంతానికి వెళ్లారు.
కాసేపు అంతా కబుర్లు చెప్పుకున్న తర్వాత వాళ్లలో ఒక అమ్మాయి అందరితో కలిసి సెల్ఫీ తీసుకుందామని అక్కడున్న బండరాయి మీద కాలు పెట్టి, వెనకాల అందరినీ ఉండమని చెప్పి ఫొటో తీసుకోబోయింది. అయితే ఆ రాయి బాగా పాచి పట్టడంతో ఆమె పైన ఫోనువైపు చూస్తుండటంతో కాలు జారి పడిపోయింది.
పక్కనే ఉన్న రాళ్లను పట్టుకుందామని ఆమె ప్రయత్నించినా, వాటికి బాగా పాచి పట్టి ఉండటంతో ఆమె లోపలకు జారిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మిగిలిన విద్యార్థులు కూడా అలాగే జారి పడిపోయారు. వాళ్ల అరుపులు అక్కడున్నవారికి వినిపించినా, కేవలం ప్రత్యూష అనే ఒక్క అమ్మాయిని మాత్రమే కాపాడగలిగారు.
కేవలం సెల్ఫీ ప్రయత్నమే ఈ ఐదుగురిని పొట్టన పెట్టుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అందరూ చాలా తెలివైన వాళ్లని అంటున్నారు. వీళ్లలో ఇద్దరు విద్యార్థులు అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని అనుకుంటున్నారు. మృతుల్లో ఇద్దరు అన్నా చెల్లెళ్లు కూడా ఉండటంతో వాళ్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అందరి తలలకు గాయాలు కనిపిస్తున్నాయి. బండరాళ్ల మీద పడిపోవడంతో తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ధర్మసాగర్ రిజర్వాయర్ను కేవలం దూరం నుంచి చూడాలి తప్ప లోపలకు వెళ్లకూడదని హెచ్చరిక బోర్డులు పెట్టినా విద్యార్ధులు అత్యుత్సాహానికి పోయి మృత్యువాత పడ్డారని పోలీసులు అంటున్నారు.