తెలుగుదేశం అగ్రనాయకుల అభిప్రాయం
కమ్యూనిస్టులవి కాలం చెల్లిన విధానాలని తాను అధికారంలో ఉన్నప్పుడు విమర్శించిన చంద్రబాబు నాయుడికి ఇప్పుడు కనువిప్పు కలిగినట్టు కనిపిస్తోంది. ఆర్ధిక సంస్కరణలే తమ కొంప ముంచాయని తెలుగుదేశం అగ్రనాయకుల అభిప్రాయం. గురువారం పొలిట్బ్యూరో సభ్యులతో చర్చించిన చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే మేనిఫెస్టో రచించే పనికి పూనుకున్నారు. తెలుగుదేశం పార్టీకి దూరమైన గ్రామీణులను, వృత్తి పనివారిని చేరువ చేసుకునేందుకు టిడిపి మేధావులు వ్యూహరచన చేస్తున్నారు. కమ్యూనిస్టులతో మళ్ళీ చేతులు కలపాలన్నది టిడిపి ప్రగాఢ ఆకాంక్షలా కనిపిస్తోంది. ఆ విషయంలో పార్టీ అగ్రనాయకుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. టిడిపి ప్రభుత్వం అమలు చేసిన ఆర్ధిక విధానాలు అభివృద్ధికి బాటలు వేశాయని, అయితే ఆ కాలంలో సమాజ సంక్షేమ కార్యక్రమాలను విస్మరించడం వల్ల సామాన్యులు పార్టీకి దూరమయ్యారన్న అభిప్రాయం ఉంది. ఈసారి అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి పథకాలు రచించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. బెంగాల్ తరహాలో గ్రామాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో రాష్ట్ర స్ధాయిలో పథకాలను రచించాలని తెలుగుదేశం మేధావులు చేసిన సూచనతో చంద్రబాబు నాయుడు ఏకీభవించారు.