హోంపేజి
సినిమా తారలకు సంబంధించిన వదంతులు బహు విచిత్రంగా ఉంటాయి. వీరి మీద వదంతులే ఎక్కువగా వస్తాయి కాబట్టి నిజమైన వార్తలను జనం నమ్మడం కాస్త తక్కువే. ఈమధ్య కత్రినా కైఫ్ విషయంలో అదే జరిగింది. ఆమె ముంబాయిలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుని ఒక సినిమా షూటింగ్లో పాల్గొనవలసి ఉంది. ఆమె టికెట్ తీసుకుని చెకిన్ కౌంటర్లో నిలబడింది. ఆమె అందాలను దగ్గర నుంచి చూడడానికి అంత కంటే మంచి సమయం ఉండదని భావించిన చెకిన్ ఉద్యోగి టికెట్ వివరాలను చెక్ చేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు చాలా దూరం వెళ్ళే వరకు. ఆమె విమానం ఎక్కి కూర్చుని గమ్యం చేరుకున్న తర్వాత కానీ ఆమెకు తెలియలేదు తాను పప్పులో కాలు వేశానని. తాను హైదరాబాద్లో బదులు అహ్మదాబాద్లో దిగానని. ఆమె ఆపసోపాలు పడుతూ చివరికి హైదరాబాద్ రావలసివచ్చింది.
నాదెండ్లకు పదవి! మరి నేదురుమల్లి?
మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా సేవలు చేసిన వారిలో ఇద్దరు మాత్రమే బతికి ఉన్నారు. వారు నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్ధన రెడ్డి. రాజకీయాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్న నాదెండ్లను ఏదైనా చిన్న రాష్ట్రానికి గవర్నర్గా పంపాలని కాంగ్రెస్ అధిష్టానవర్గం యోచిస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. గతంలో నేదురుమల్లికి కూడా ఇటువంటి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆయన అంగీకరించలేదని తెలుస్తోంది. గవర్నర్ పదవిని ఆయన కాదనుకున్నారంటే అంతకంటే ముఖ్యమైన పదవిని జనార్ధనరెడ్డి ఆశిస్తున్నారన్న మాట. చంద్రబాబు కంటే కొన్నేళ్ళ ముందే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ మద్దతుతో నెలరోజుల పాటు ముఖ్యమంత్రిగా (నెలరాజు) పనిచేసిన నాదెండ్ల భాస్కరరావుకు పరిపాలనా దక్షుడిగా పేరుంది. నేదురుమల్లి జనార్ధనరెడ్డికి కూడా ఈ విషయంలో మంచి పేరే ఉంది. కానీ ఆయనకు ధనార్జనరెడ్డి అని ఒక ముద్దు పేరు ఉండేది.
దొరకునా ఇటువంటి ప్రధాన న్యాయమూర్తి
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గణ్పత్ సింగ్ సింఘ్వీది విశిష్ట వ్యక్తిత్వం. జడ్జీలకు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నామమాత్రపు ధరలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వడం అన్యాయమని ఆయన చేసి వ్యాఖ్య ఇతర రంగాల్లోనే గాక న్యాయవ్యవస్ధలో కూడా సంచలనం కలిగిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జడ్జీలకు, ఎమ్మెల్యేలకు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు,జర్నలిస్టులకు కలిపి హైదరాబాద్ నగరంలో వివిధ చోట్ల మూడు వందలకు పైగా ఎకరాల స్ధలాన్ని కేటాయింది. ఆ ప్లాట్లను హుడా అభివృద్ధి చేయవలసి ఉంటుంది. ఐఎఎస్, ఐపిఎస్, జర్నలిస్టులకు స్ధలాలు ఇవ్వడాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎందుకు తప్పు పట్టలేదో బోధపడడం లేదు. గతంలో ఒక పత్రికలో వచ్చిన వార్తను ప్రజాప్రయోజన వ్యాజ్యానికి మద్దతుగా సమర్పించినప్పుడు జస్టిస్ సింఘ్వి పత్రికలు అంత పవిత్రమైనవి కావన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు.