ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి ఇదివరకటిలా ఆడింది ఆట, పాడింది పాటగా సాగడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నిన్న హైదరాబాద్లో వ్యవహరించిన తీరును బట్టి వైఎస్ మీద అధిష్టానవర్గం గట్టి నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలు ఎన్నిక కావడమే. అందువల్ల వైఎస్ను హైకమాండ్ అదృష్ట చిహ్నంగా పరిగణించేది. ప్రభుత్వం భూములను విచ్చల విడిగా అమ్మేయడం, దానివల్ల పార్టీకి వచ్చిన చెడ్డ పేరు గురించి కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆందోళన చెందుతోంది. ఈ వ్యవహారం మీద ఒక నివేదిక సమర్పించవలసిందిగా దిగ్విజయ్ సింగ్ కోరడం గమనార్హం. స్వతహాగా కోపిష్టి అయిన ముఖ్యమంత్రికి హైకమాండ్ జోక్యం అసహనం కలిగిస్తోంది. అయితే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి మరొకరిని అందలం ఎక్కించే ఆలోచన హైకమాండ్కు లేదు. సాధ్యమైనంత వరకు వైఎస్ను దారిలో పెట్టుకోడానికే కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం, వామపక్షాలకు ఇటీవల ప్రజాదరణ పెరుగుతున్నట్టు కన్పించడం కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆందోళనకు మరో కారణం.