వేదాలు వల్లించినట్టు
దయ్యాలు వేదాలు వల్లించినట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మానవహక్కుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తన హయాంలో నక్సలైట్లను తీవ్రంగా అణిచివేసిన చంద్రబాబు నాయుడు నల్లమలలో జరిగినది బూటకపు ఎన్కౌంటర్ అని నిన్న విమర్శించడంతో అన్ని వర్గాల ప్రజలు విస్తుబోయారు. పేద ప్రజలకు వ్యతిరేకమైన విధానాలను అనుసరించారని చంద్రబాబుపై ముద్రవేసిన నక్సలైట్లు ఆయనను టార్గెట్గా చేసుకుని తిరుపతి వద్ద దాడి చేశారు. వైఎస్ను మొదట నమినట్టు కన్పించిన నక్సలైట్లు ఇప్పుడు ఆయనను కూడా టార్గెట్లో పెట్టుకున్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా సహజంగా నక్సలైట్లకు శత్రువులు అవుతారు. సురవరం సుధాకర్రెడ్డి, బివి రాఘవులు వంటి వామపక్షులు ముఖ్యమంత్రులైనా ఆ థ్రెట్ తప్పదు. మాజీ డిజిపి, తెలుగుదేశం నాయకుడు కె విజయరామారావు కూడా నల్లమల ఎన్కౌంటర్ను ఖండించడం మరో విశేషం. చంద్రబాబు నాయుడు హయాంలో నక్సలైట్ అగ్రనాయకులు నల్లా ఆదిరెడ్డి, సంతోష్రెడ్డి, పురుషోత్తంలను బెంగుళూరులో పట్టుకుని కొయ్యూరు ఎన్కౌంటర్లో పోలీసుకు కాల్చి చంపారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు మరో మాట మాట్లాడడం మన నాయకులకు మామూలై పోయింది.