తనను నమ్ముకున్న వారి కోసం ఏదైనా చేయడానికి ముఖ్యమంత్రి
తనను నమ్ముకున్న వారి కోసం ఏదైనా చేయడానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సిద్ధమని అనేక సార్లు రుజువైంది. ఆయన కొన్ని పదవులను తాను అధికారంలోకి రాకముందే రిజర్వు చేసినట్టు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్ష పదవిని ఆయన తన చిరకాల అనుచరుడైన సుధీర్రెడ్డికి కట్టబెట్టారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తన సన్నిహిత సహచరుడు కరుణాకర్ రెడ్డిని నియమించారు. విజయవాడ-గుంటూరు-తెనాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వైఎస్ సొంత మనిషి మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈమధ్య పట్టణ, నగర భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ మూడు పోస్టులకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. నామినేటెట్ పోస్టుల విషయానికి వచ్చేసరికి వైఎస్ తన మనుషులను తప్ప మరెవరి పేరునూ పరిశీలించడం లేదు. పైన పేర్కొన్న మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు చైర్మన్లను మాత్రమే నియమించి పాలక మండలి సభ్యులను నియమించకపోవడం ఏం ప్రజాస్వామ్యమని కాంగ్రెస్ నాయకులే జనాంతికంగా విమర్శిస్తున్నారు.