చిత్తూరులోనూ రాజు 'లెగ్'
ప్రముఖ కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగాలతోపాటు పెద్ద మొత్తంలో సొమ్ము ఆశచూపి, పేదల, గిరిజనుల అనుభవంలోని భూములను కొన్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వీటిలో అధికశాతం ఒప్పందాలు 'దంఛిడు లక్ష్మమ్మ' పేరిట ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.
ఎస్ సి, ఎస్ టి పేదల అధీనంలో ఉన్న ఇక్కడి భూములపై ఎవరికీ చట్టపరమైన హక్కులు లేవు. అయితే, 'సత్యం'తో బంధుత్వాలున్న ఉన్న కొందరు రాజులు పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కొంతకాలంనుంచీ మకాంవేశారు. భూములు అప్పగిస్తే డబ్బుతోపాటు ఉద్యోగాలు ఎరచూపారు. మొత్తంమీద అమాయక గిరిజనులను, పేద రైతులను మాయమాటలతో లోబరచుకుని భూములు కొన్నారు.
ఈ వ్యవహారంలో స్థానికులతోపాటు ఒకరిద్దరు న్యాయవాదులు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మరోవైపు పేదలు అష్టకష్టాలు పడి చదును చేసుకుని, పంటలు పండించుకుంటున్న ఇక్కడి భూములపై కొందరు వ్యక్తులకు-ప్రభుత్వానికి మధ్య కోర్టులలో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అయినా సాంకేతిక లోపాలను అడ్డు పెట్టుకుని కొందరు దళారులు ఆ పేదలతో అగ్రిమెంట్లు రాయించుకున్నారు.
నయాన దారికిరాని వారినుంచి భయాన భూమి లాక్కునేందుకూ తెగబడటంతో పుత్తూరు పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. 2007లో భూముల కొనుగోలు తతంగమంతా అగ్రిమెంట్లు, తెల్లకాగితాల మీదే నడవగా, లక్షలాది రూ పాయలు చెల్లించారు. భూమి అప్పగించడం ఇష్టంలేకపోయినా బినామీల బెదిరింపులతో కొందరు గిరిజనులు, ఇచ్చిన సొమ్ము తీసుకుని ఆ ప్రాంతం వీడిపోయారు. మరికొందరు బతుకుతెరువు కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.