వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుగారి హోంమంత్రి ఎవరో?

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఎన్నికల్లో మెజారిటీ తమదేనంటూ తెలుగుదేశం పార్టీ ముందే కూస్తోంది. విందులు చేస్తోంది. టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఎవరికి ఏ మంత్రి పదవి దక్కుతుందోనంటూ ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితాలు రావడానికి ముందే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోతోంది టీడీపీ. ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షలు, సర్వేలు పూర్తిచేసి తాజాగా ప్రభుత్వ ఏర్పాటు, తర్వాత శాఖల కేటాయింపుపై కూడా కసరత్తులు కసకసా చేసేస్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. హోం, రెవెన్యూ, ఫైనాన్స్‌, ఇరిగేషన్ శాఖలకు డిమాండ్ విపరీతంగా ఉంది. మిగతా పార్టీలు, నాయకులు ఈ విషయంలో ఎంతో వెనుకబడి ఉండగా టీడీపీ ఆఫీసు మాత్రం ఇదే చర్చలతో హాట్‌హాట్‌గా ఉంది. ముక్కోణపు పోటీ... ముందెన్నడూ లేనంత రాజకీయ వేడి...ఫలితాలు రావడానికి ఇంకా రెండు వారాల పైగా సమయం. తెలుగుదేశం నేతల మనో వేగానికి ఇవేమీ అడ్డంకి కావడం లేదు.

హంగ్‌ తప్పదనే అంచనాలతో రాజకీయ మేథావులే రకరకాల అంచనాలు వేస్తుంటే ఎన్టీఆర్‌ భవన్‌ మాత్రం ప్రభుత్వ ఏర్పాటు చర్చలతో హోరెత్తిపోతోంది. ఏఏ శాఖలు ఎవరెవరికి కేటాయించాలనే విషయంపై కూడా ఇప్పటికే దృష్టి సారించింది టీడీపీ. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితోపాటు కొత్తగా టిక్కెట్లు పొందిన జూనియర్లు కూడా మంత్రి పదవుల రేసులో ఉన్నారని చెబుతున్నారు. మంత్రి పదవుల్లో బాలయ్యకో కోటా, జూ ఎన్టీఆర్ కు ఓ కోటా ఉందని తెలుస్తోంది. హోం, రెవెన్యూ, ఫైనాన్స్‌, ఇరిగేషన్‌ శాఖల కోసం ఇప్పటికే తీవ్రపోటీ. అంతా తమ్ముళ్లు తలచినట్టే జరిగితే...ఎవరెవరికి ఏఏ పదవులో పంపకాలు మాటల్లోనే జరిగిపోతున్నాయి. ఈసారీ హోంశాఖ తెలంగాణకేనన్న ప్రచారంతో నాగం జనార్దన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ల మధ్య పోటీ పెరుగుతోంది. అలాకాకుండా బీసీకి ఇచ్చేటట్టైతే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరు వినిపిస్తోంది. రెవెన్యూశాఖ అశోక్‌ గజపతి రాజు పేరు వినిపిస్తోంది. ఇక నీటిపారుదల శాఖకు పోటీ మరీ ఎక్కువ. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కేఈ కృష్ణమూర్తిలు రేసులో ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. ఇక ఆర్థిక మంత్రిగానూ యనమల రామకృష్ణుడు పేరే బలంగా వినిపిస్తోంది.

విద్యుత్‌ శాఖకు వేణుగోపాలాచారీ, వైద్యారోగ్య శాఖకు కోడెల శివప్రసాద్‌ పేర్ల పైనా ప్రముఖంగా చర్చ నడుస్తోంది. గెలిచి తాముకూడా రేసులో దూసుకుపోతామంటున్నారు కొందరు చరిష్మా ఉన్న జూనియర్లు. రోజా, దేవినేని ఉమా, పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ నరేంద్ర, జూనియర్‌ ఎన్టీఆర్‌ కోటాలో రేవంత్‌ రెడ్డి ఇలా ఎవరికివారు ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. వీరే కాకుండా మండలిలోనూ కొంత మంది సీనియర్లు ఉండడంతో మంత్రి పదవుల కోసం వారు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నన్నపనేని రాజకుమారి పేరు బాగా వినిపిస్తోంది. ఇక కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పదవి దక్కే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ఇలా రకరకాల అంచనాలు వేస్తూ ఖాళీగా ఉండకుండా క్రియేటివిటీకి పదునుపెట్టేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారం దక్కుతుందో..లేదో తెలీదు కానీ పార్టీ కార్యాలయంలో మాత్రం చర్చల్లోనే పదవుల పంపిణీ జరిగిపోతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X