యువరాజు 'తేజ' అరెస్టు?
'సత్యం' కేసులో నిధుల మళ్లింపునకు ఆధారాలు సంపాదించిన సీఐడీఅధికారులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర వహించిన రామలింగరాజు సోదరుడు ఎస్ఆర్ఎస్ఆర్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ బీ సూర్యనారాయణరాజు, రామలింగరాజు కుమారుడు తేజరాజులను అరెస్టు చేయడానికి సన్నద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. రామలింగరాజు బినామీ ఆస్తుల పరిరక్షకుడైన సూర్యనారాయణరాజును అరెస్టు చేయడానికి ముందుగా అతడి పేరు రికార్డుల్లోకొచ్చే విధంగా సీఐడీఅధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
అరెస్టులన్నీ లింక్ పద్ధతిలో జరిగే అవకాశం ఉండడంతో కీలక వ్యక్తుల పేర్లు అరెస్టైనవారి నేర అంగీకారపత్రంలో వచ్చేలా సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎస్ఆర్ఎస్ఆర్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న డీ వెంకట గోపాలకృష్టంరాజును ఈనెల 22న అరెస్టు చేసిన సీఐడీపోలీసులు అతణ్ని నిశితంగా విచారించారు. బినామీ ఆస్తుల కొనుగోళ్ల్లు, అందుకు సంబంధించిన పత్రాలను భద్రపర చడంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారి సమాచారాన్ని రాబట్టారు. ఈ క్రమంలోనే గోపాలకృష్టంరాజు స్టేట్మెంట్లో రామలింగరాజు కుమారుడు తేజరాజు, సోదరుడు సూర్యనారాయణరాజుల వివరాలు వచ్చేలా జాగ్రత్త పడ్డారు.
గోపాలకృష్టంరాజుతో కలిసి పనిచేసిన కలిదిండి వెంకట నర్సింహరాజు, గతంలో ఇదే బాధ్యతలు నిర్వహించిన ఏవీ రాఘవరాజు, ప్రస్తుతం పనిచేస్తున్న కేవీవీ కృష్టంరాజు, కే గోపాలకృష్ణంరాజులతో పాటు ఎంవీఎస్ విజయకుమార్రాజు, ఎం సుబ్బరాజు, జీవీ నర్సింహరాజులను ఈ కేసులో సాక్షులను చేయడానికి సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తమ వద్ద హజరుకావాలంటూ... భూముల విక్రయాలకు సంబంధించిన పత్రాలను భద్రపరిచిన వారిలో కొందరికి సీఐడీ డీఎస్పీ బాలాజీరావు సమన్లు జారీ చేశారు. వీరిలో కొందరు రెండు రోజులుగా సీఐడీకార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నారు. వీరిని విచారించి, స్టేట్మెంట్లు రికార్డు చేసుకుని అందులో తేజరాజు, సూర్యనారాయణరాజుల పేర్లు వచ్చిన తర్వాత ఇద్దర్నీ అరెస్టు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
తేజరాజు, సూర్యనారాయణరాజు, రామలింగరాజుల ఆదేశాల మేరకే భూముల క్రయవిక్రయాలు జరిగాయని, ఈ పత్రాలను భద్రపరచాలంటూ ఆదేశించింది వారేననే విషయాన్ని రాతపూర్వకంగా రికార్డుల్లోకి ఎక్కించడంలో సీఐడీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, మేటాస్ ప్రాపర్టీ స్కు చెందిన డాక్యుమెంట్లను భద్రపరిచిన కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ వేణు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కే బద్రిలను ప్రస్తుతం సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. మేటాస్లో జరుగుతున్న సోదాల్లో ఇప్పటికే అనేక విలువైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.