రోశయ్యకు అనూహ్య మద్దతు
ప్రభుత్వంపై పట్టు సాధిస్తున్న ముఖ్యమంత్రి రోశయ్య వర్గం క్రమంగా సిఎల్పిపైనా పట్టుసాధించే దిశగా అడుగులేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో భాగంగా గత ఆరేళ్ల నుంచి సిఎల్పిపై ఎదురులేకుండా గుత్తాధిపత్యం వహిస్తోన్న వైఎస్ వర్గానికి తాజాగా పెద్ద షాకే తగిలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్రావు శుక్రవారం సిఎల్ పిలో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి, తామంతా కేవలం వైఎస్ వల్లే గెలవలేదని, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ అభివృద్ధి కార్యక్రమాల వల్లే గెలిచామంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో సంచలనం సృష్టించాయి. వైఎస్ వల్ల గెలిచింది కేవలం 10 శాతమేనంటూ ఆయన చేసిన వ్యాఖ్య వైఎస్ వర్గాన్ని ఇరుకునపెట్టింది. నిజానికి, గత ఆరేళ్లుగా సిఎల్పి కార్యాలయం వైఎస్ వర్గం ఏలుబడి లోనే కొనసాగుతోంది. అక్కడి పర్యవేక్షకుల అనుమతి లేనిదే విలేకరుల సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదన్నది బహిరంగమే.
మాజీ ఎమ్మెల్యేలకయితే అసలు విలేకరుల సమావేశం నిర్వహించుకునే అవకాశమే లేదు. వారు సిఎల్పి బయటకొచ్చి మీడియాతో మాట్లాడవలసిందే. తెలంగాణపై పార్టీలో వివాదం మొదలయిన నాటి నుంచి ఈ సంస్కృతి మొదలయింది. వైఎస్ మృతి చెందిన తర్వాత జగన్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండు, దానికి సంబంధించిన వ్యూహాలన్నీ సిఎల్పి కేంద్రంగానే ఊపిరిపోసుకున్నాయన్నది తెలిసిందే. వైఎస్ మరణించిన తర్వాత జగన్కు సిఎం ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామంటూ ఎమ్మెల్యేలు సిఎల్పిలో ప్రెస్మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. ఇప్పుడు జగన్ వర్గం అంత బలంగా లేదు. రోశయ్య వర్గం అంటే వైఎస్ వ్యతిరేక వర్గం క్రమంగా బలపడుతోంది.