జగన్ తో రోశయ్య బిగ్ ఫైట్
వైయస్ ఉన్నప్పుడు నిధుల విడుదల ఆగలేదని, తాను మాత్రమే వాటిని నిలుపుదల చేసి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నానన్నట్లుగా కృష్ణయ్యతో జగనే ఆందోళన చేయించి, బీసీలను తనపైకి ఉసిగొల్పుతున్నారని రోశయ్య అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి దినపత్రికలో కూడా రోశయ్యకు వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ఆ అసహనంతోనే రోశయ్య 'వైయస్ దేవుడు, నేను రాక్షసుడినా" అంటూ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయవలసి వచ్చింది.
జగన్ తనను కుల సంకటంలో ఇరికించి, నాయకులతో బీసీ వ్యతిరేక ముద్ర వేయడం వల్లే రోశయ్య కూడా దానికి పై ఎత్తుగా వైయస్ వర్గీయులైన బీసీ మంత్రులతోనే వైయస్ హయాం నుంచి ఫీజుల బకాయిలు ఉన్నాయంటూ ప్రకటింపచేశారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి, వైయస్ జమానా నుంచి ఫీజుల బకాయిలున్నాయని ప్రకటించిన 8 మంత్రుల్లో ఆరుగురు పూర్తిగా జగన్ మద్దతుదారులే కావడంతో..రోశయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి వారినే తెరపైకి తెచ్చి జగన్ వ్యూహాన్ని దెబ్బకొట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.