జగన్ పార్టీ సవాల్: యాత్రతో సిద్ధమౌతున్న బాబు
అందుకు టిడిపి కూడా ఘాటుగానే స్పందిస్తోంది. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్య ఎప్పుడో చీకటి ఒప్పందం జరిగిపోయిందని, జగన్ కాంగ్రెసు అండదండలతో జైలు నుండి బయటకు వస్తారని చెబుతోంది. అయితే తమ విమర్శలకు మరింత బలం చేకూరేందుకు, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని చెప్పేందుకు చంద్రబాబు వచ్చే శాసనసభ సమావేశాలలో అవిశ్వాసం పెట్టే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిన్నటి వరకు పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఇప్పుడు బాగుండటంతో కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి, జగన్ జైలులో ఉండటంతో ఏం చేయలేక పాలుపోతున్న వైయస్సార్ కాంగ్రెసుకు ప్రతి సవాల్ విసరాలని భావిస్తున్నారట. ఇటీవలి వరకు తెలంగాణలో టిడిపి పరిస్థితి దారుణంగా ఉండింది. ఇప్పుడు క్రమంగా మెరుగుపడుతోంది. మరోవైపు సీమాంద్రలో కూడా జగన్ పార్టీకి సెంటిమెంట్ కలిసొచ్చింది. టిడిపి మొన్నటి వరకు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
దీంతో 2014లో టిడిపి అధికారంలోకి వస్తుందో లేదో అనే అనుమానంతో పలువురు నేతలు పక్క పార్టీల వైపుకు జంప్ అయ్యారు. కొంతమంది చూస్తున్నారు. అయితే చంద్రబాబు పాదయాత్రతో టిడిపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆయనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. దీంతో ఇప్పటి వరకు పార్టీని వీడి వెళ్లాలనుకున్న వారు పునరాలోచనలో పడ్డారు. మరోవైపు జగన్కు ఆస్తుల కేసు రోజు రోజుకు ఇబ్బందులను కలిగిస్తోంది.
మొన్న సిబిఐ జగన్ ఆస్తులను జప్తు చేయగా, నిన్న ఈడి రంగంలోకి దిగింది. మరోవైపు మార్చి నెలాఖరు వరకు బెయిల్ అడగవద్దని సుప్రీం కోర్టు జగన్ను ఆదేశించింది. ఆ తర్వాత కూడా బెయిల్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం. దీంతో వైయస్సార్ కాంగ్రెసును నడిపించేందుకు బలమైన నేత కరువయ్యారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టినా, పెట్టకపోయనా, మధ్యంతరం వచ్చినా రాకపోయినా కొన్నాళ్లకే 2014లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
జగన్ మరో ఐదు నెలల వరకు జైలులోనే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నందున ఆ పార్టీ ప్రభావం తగ్గిపోయే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అదే సమయంలో కాంగ్రెసు పరిస్థితి ఏమంత బాగా లేదు. ఇంకోవైపు తెలంగాణలో తెరాసకు పలు పార్టీలు పోటీగా తయారవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో తమ ఓట్ బ్యాంక్ కలిసొస్తుందని టిడిపి గట్టిగా విశ్వసిస్తోంది. ఇవన్నీ బేరీజు వేసుకుంటే చంద్రబాబు మాత్రమే బెట్టర్ అని పలువురు పునరాలోచనలో పడుతున్నరట. ప్రధానంగా చంద్రబాబు మధ్యంతరం ఆశలతోనే యాత్ర చేపట్టి ఉంటారని చెబుతున్నారు.