జగన్ కేసు: సూరీడు యు-టర్న్ వెనుక...
దీంతో సూరీడును సిబిఐ విచారించింది. తాను చెప్పిన విషయాలను పూసగుచ్చినట్లు మెజిస్ట్రేట్ ముందు కూడా చెబుతానని సూరీడు సిబిఐకి చెప్పాడు. కానీ ఆ తర్వాత అతను స్పందించలేదు. పలుమార్లు సమన్లు జారీ అయినా వాంగ్మూలం ఇవ్వలేదు. దీంతో హామీ మేరకు సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వైయస్తో ఎంతో అనుబంధం కలిగిన సూరీడు వాస్తవాలు వెల్లడిస్తే.. జగన్ మెడకు అక్రమ ఆస్తుల ఉచ్చు పూర్తిగా బిగుసుకున్నట్లేనని అప్పట్లో రాజకీయ వర్గాలు భావించాయి.
ఒక విధంగా చెప్పాలంటే.. న్యాయస్థానంలో సూరీడు పెదవి విప్పితే.. జగన్ కేసులోని అనేక చిక్కుముడులు విడిపోయి.. సిబిఐ పని సులువవుతుందని భావించారు. కానీ సూరీడు స్పందించక పోవడంతో కథ మొదటికి వచ్చింది. ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్న ఓ రాయలసీమ నేతతో గంటల కొద్దీ మంతనాలు జరిపిన తర్వాతే సిబిఐకి సూరీడు సహకరించడం మానేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఆ నేత నివాసానికి సూరీడు ఎందుకెళ్లారు, ఏం మాట్లాడారనే అంశంపై చర్చ జరుగుతోంది.
ఆ తర్వాతే సిబిఐకి ఎందుకు ఎదురు తిరిగారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైయస్కు ఆ నేతతో ఎప్పుడూ సత్సంబంధాలు లేవని అంటున్నారు. అలాంటిది వైయస్ మరణానంతరం ఆ నేత జగన్కు దగ్గర కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఇదంతా తెలిసిన సూరీడు ఉన్నపళంగా ఆ నేత ఇంటికి వెళ్లి సుదీర్ఘ మంతనాలు జరపడానికి కారణాలను రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. ఆ నేత ద్వారా సూరీడుపై ఒత్తిడి పెరిగిందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.