జెడి కాల్ డేటా లీక్: అజ్ఞాతంలోకి ఇన్స్పెక్టర్
ఇప్పటికే సస్పెండ్ అయిన సిఐ పరారీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు వాంగ్మూలం ఇస్తేనే ఈ కేసులోని ఇతర నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సిఐడి పోలీసుల రాకను పసిగట్టి ఆయన మూడుసార్లు తప్పించుకున్నట్లు సమాచారం. అతను విధులు నిర్వర్తించిన నాచారం పోలీస్ స్టేషన్ నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్డిస్క్లోని వివరాలు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు సాక్షి విలేకరి యాదగిరిరెడ్డిని ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు ప్రయత్నించారు. అయితే అనారోగ్యంగా ఉందని ఆయన చెప్పినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చడంతో ఇక అరెస్టు తప్పదని భావించే ఆయన అనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక కాల్డేటాను పంపించిన టెలికాం సిబ్బంది నుంచి కూడా అధికారులు వాంగ్మూలం తీసుకుంటున్నారు. తాజాగా మరో ఇద్దరిని కూడా పిలిపించినట్లు సమాచారం.
జేడీ కాల్డేటా సమాచారం సేకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన కీలక వ్యక్తిని కూడా విచారించినట్లు తెలిసింది. వ్యాపారి రఘురామ కృష్ణరాజును రెండు రోజుల్లో అరెస్టు చేయవచ్చని సమాచారం.