జగన్ కేసు: సూరీడిపై సిబిఐ ఒత్తిడి?
వైయస్ జగన్కు, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సిబిఐ సూరీడిపై తీవ్రమైన ఒత్తిడి పెడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. వైయస్ జగన్కు బెయిల్ రాకుండా సిబిఐ కుట్ర చేస్తోందని కూడా విమర్శిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడానికి ముందుకు ఆయనకు, వైయస్ జగన్కు, ఆయన కుటుంబ సభ్యులకు బెరైటీస్ గునలు తప్ప మరేమీ లేదని సూరీడు సిబిఐకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
వైయస్ జగన్ సంపదను పోగు చేసుకోవడానికి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కూడా సూరీడు సిబిఐకి చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, అవే విషయాలను మెజిస్ట్రేట్ ముందు చెప్పడానికి సూరీడు నిరాకరించినట్లు సమాచారం.
సిబిఐ వద్ద కీలకమైన విషయాలను బయట పెట్టిన సూరీడు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చేసరికి వెనక్కి తగ్గారని అంటున్నారు. దీనిపైనే సూరీడిపై సిబిఐ తీవ్రమైన ఒత్తిడి పెడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.