ఆ ఘనత బొత్సది, ఈ ఘనత బొత్స భార్యదట
ఫీజు రీయింబర్స్మెంట్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పథకం కాదని ఆయన వ్యాఖ్యానించారు. నాడు ఫీజు రీయింబర్స్మెంట్పై తాను మంత్రి రఘువీరారెడ్డి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కసరత్తు చేసి వైయస్ రాజశేఖర రెడ్డికి కొన్ని సిఫార్సులు చేశామని ఆయన మంగళవారం గాంధీభవన్లో తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం.
ఫీజు రీయింబర్స్మెంట్ బిసి, ఒబిసి, ఇతర ఉన్నత వర్గాల్లోని పేద కుటుంబాల విద్యార్థులకు వర్తింపజేయాలని సూచన చేశామని ఆయన వివరించారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్పై తాము కసరత్తు చేసి నివేదిక సమర్పిస్తే, సిఎల్పి నాయకునిగా ఉన్న వైయస్కు పేరు వచ్చిందని బొత్స అన్నట్లు తెలిసింది. అదేవిధంగా ఇందిర జలప్రభ పథకాన్ని విజయనగరంలో బొత్స ఝాన్సీ ప్రతిపాదించారని ఆయన తెలిపారు.
మొత్తం మీద, క్రెడిట్ కొట్టేయడానికి బొత్స సత్యనారాయణ ప్రయత్నిస్తున్నారని గిట్టనివారు అనుకుంటే ఏమీ చేయలేం. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్మెంట్ పథకానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆయన భార్య, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వీధుల్లోకి వచ్చి మొత్తుకుంటున్నారు. ఎవరు ప్రతిపాదించినా క్రెడిట్ మాత్రం ఇప్పుడు వైయస్ జగన్ కొట్టేస్తున్నారని చెప్పుకోవాలి.