నటి హేమశ్రీ అప్పటికే స్పృహలో లేదట
ఆక్టోబర్ 8వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు బయలుదేరినప్పుడే హేమశ్రీ పూర్తిగా స్పృహలో లేదని సతీష్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ విషయం సురేంద్రబాబుతో అంటే కారు నడపడమే నీ పని అని సురేంద్ర బాబు తనతో అన్నాడని సతీష్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
అనంతపురంలోని తన మిత్రుడి రిసార్ట్కు 9వ తేదీ ఉదయం ఆరు గంటలకు చేరుకున్నారు. రిసార్ట్ ఉద్యోగుల సహాయం హేమశ్రీని కారులో నుంచి దించారు. అదే రోజు సతీష్ కారు తీసుకుని బెంగళూర్ వచ్చేసి సురేంద్ర బాబు సోదరుడి ఇంటికి వెళ్లి కారు అప్పగించేశాడు.
సురేంద్ర బాబు తీరుపై అనుమానం వచ్చిన రిసార్ట్ ఉద్యోగులు మురళికి విషయం చెప్పారు. వెంటనే ఖాళీ చేయాలని మురళీ సురేంద్రబాబుకు చెప్పాడట. దాంతో సురేంద్రబాబు టాక్సీ తీసుకుని మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో బాప్టిస్టు ఆస్పత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది. హేమశ్రీ మరణించిన వార్త టీవీ చానెళ్లలో వస్తుండడంతో భయపడి సతీష్ గోవా పారిపోయాడని తెలుస్తోంది.
హేమశ్రీకి రెండు సార్లు క్లోరోఫామ్ ఇచ్చినట్లు సురేంద్ర బాబు దర్యాప్తు అధికారుల వద్ద అంగీకరించినట్లు తెలుస్తోంది. బెంగళూర్ నుంచి అనంతపురం బయలుదేరే ముందు ఓసారి, మార్గమధ్యంలో మరోసారి క్లోరోఫామ్ ఇచ్చినట్లు అతను చెప్పాడని అంటున్నారు. డోస్ ఎంతో తెలియకనే అలా చేసినట్లు అతను చెబుతున్నాడట.