జగన్ పార్టీలోకి జిట్టా బాలకృష్ణా రెడ్డి?
గత ఎన్నికల్లో ఆయన నల్లగొండ జిల్లా భువనగిరి శాసనసభా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. నిజానికి, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఆయనకు భువనగిరి సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, పొత్తు కారణంగా ఆ సీటు తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లిపోయింది. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి భువనగిరి నుంచి పోటీ చేశారు. దాంతో ఆయన కెసిఆర్పై తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
జిట్టా బాలకృష్ణా రెడ్డి మొదటి నుంచి తెలంగాణవాది. కెసిఆర్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటైన తెలంగాణ సాంస్కృతిక మేళాలో జిట్టా బాలకృష్ణా రెడ్డిది ప్రధాన పాత్ర అంటారు. వచ్చే ఎన్నికల్లో భువనగిరి శాసనసభా స్థానం కేటాయిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాగా, తెరాసలో కీలక పాత్ర పోషించిన కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప రెడ్డి ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల సీటును ఆశించి భంగపడిన కెకె మహేందర్ రెడ్డి తెరాసకు గుడ్బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. వరంగల్ జిల్లా జనగాం నుంచి మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేతిలో స్వల్ప ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో ప్రతాప రెడ్డి ఓడిపోయారు. ఏమైనా, తెలంగాణలోని ఓ వర్గం వైయస్ జగన్ వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.