ఏళ్లకు సీక్రెట్ ఆఫరేషన్: జైల్లో 'తోడు' కోరిన కసబ్
మే 1998లో నాటి ఎన్డీయే ప్రభుత్వం పోఖ్రాన్-2ను అత్యంత రహస్యంగా పరీక్షించింది. పోఖ్రాన్-2 ప్రయోగించే వరకు ఎవరికీ తెలియదు. ఈ ఆపరేషన్ను నాటి ప్రభుత్వం అత్యంత గోప్యంగా పరీక్షించింది. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అమెరికా, పాకిస్తాన్లో కలవరం పుట్టించింది. దీని తర్వాత అత్యంత గోప్యంగా జరిగిన చాలా ముఖ్యమైన ఆపరేషన్ అజ్మల్ కసబ్దే! అంటే 15 ఏళ్ల తర్వాత కేంద్రం మరో పెద్ద ఆపరేషన్ను గప్చుప్గా అమలుపర్చింది.
నవంబర్ 5న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడం, దేవన్ భారతి నేతృత్వంలో 17 మంది అధికారులతో ఆపరేషన్ ఎక్స్ ప్రారంభం కావడం, 7న కేంద్ర హోంశాఖ ఉరి తీయాలని నిర్ణయించుకోవడం, 8న సర్రాకు ఆమోదించడం, ఆ తర్వాత పాక్కు, కసబ్ కుటుంబ సభ్యులకు తెలియజేయడం, 19న ముంబయి ఆర్ధర్ రోడ్డు నుండి పూణే ఎరవాడ జైలుకు తరలించడం, 21న ఉరిశిక్ష అమలుపర్చడం అంతా సీక్రెట్గా జరిగిపోయింది.
జైలులో ఉన్నప్పుడు కసబ్ విచిత్రంగా ప్రవర్తించే వాడనే విషయం తెలిసిందే. మటన్ బిర్యానీ కావాలని కోరాడు. మొదట అధికారులపై దాడి కూడా చేశాడు. అతను జైలులో ఉన్నప్పుడు పలు కోర్కెలను అధికారుల ముందు పెట్టాడట. అందులో పెళ్లి కూడా ఉంది. ఒక్క గదిలోనే బోర్ కొడుతోందని వేరే గదికి మార్చాలని అధికారులకు మొరపెట్టుకునేవాడు. బాస్మతీ అన్నమైతేనే తింటానని మొండిపట్టు పట్టేవాడు.
అంతేకాదు 2010లో తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడట. ఒంటరితనాన్ని భరించలేక పోతున్నానని, తోడు కావాలని కోరాడట. కాగా అరెస్టు చేసినప్పటి నుండి కసబ్కు భద్రత నుండి న్యాయవాదుల వరకు అయిన ఖర్చు దాదాపు యాభై కోట్ల రూపాయలకు పైగా అయిందని అంచనా. కానీ కేంద్రం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రకటించింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఖైదీ కసబ్.