తెలంగాణపై విజయమ్మను ప్రయోగించిన కిరణ్
గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీమాంధ్ర జిల్లాల్లో సాధారణ ప్రతిపక్ష కార్యకర్తలు అడ్డుకోవడం మినహాయించి అంతా ప్రశాంతంగా జరిగింది. అయితే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నం. వరంగల్ జిల్లాలో ప్రతిపక్షాలతో పాటు తెలంగాణవాదులు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కార్యక్రమం అర్ధాంతరంగానే ముగిసిందని చెప్పవచ్చు.
ఇప్పుడు ఆయన తాజాగా ఇందిర బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమం పూర్తయింది. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఆ తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కిరణ్ భావిస్తున్నారు. అయితే తనకు రచ్చబండ కార్యక్రమంలో ఎదురైన పరాభవం ఇందిర బాటలో పునరావృతం కాకూడదన్న గట్టి భావనతో ఆయన ఉన్నారు.
దీంతో ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో చేపట్టే ముందు ఇక్కడి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం కిరణ్ చేశారట. అయితే అంతలో వైయస్ విజయమ్మ చేనేత దీక్ష తలపెట్టడంతో కిరణ్కు పరిస్థితి తెలిసే అవకాశం లభించిందని, దీంతో అతను భారీ బలగాలతో ఆమె దీక్షకు అనుమతించారని, తద్వారా తెలంగాణలో పర్యటిస్తే ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం దొరికిందని చెబుతున్నారు.