విజయశాంతి మాటలు బిజెపి విని ఉంటే..
మహబూబ్నగర్ వేరు, పరకాల వేరు అని, పరకాలలో బిజెపి పోటీకి దిగడం సరి కాదని విజయశాంతి ఎన్నికలకు ముందు చెప్పారు. పోటీ నుంచి విరమించుకుంటే బిజెపి పరువుకు దక్కుతుందని కూడా ఆమె చెప్పారు. అయితే, విజయశాంతి మాటలను బిజెపి రాష్ట్ర నాయకులు పెడచెవిన పెట్టారు. పోటీకి దిగి, గెలిచి తీరుతామనే ప్రకటనలు చేశారు. తెరాసను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు.
పరకాల ఓటమి తీరుతో తెలంగాణవాదం బిజెపికి కలిసి రాదనే విషయాన్ని నిరూపించుకున్నట్లు అయింది. ఇక, తెరాసకు, తెలంగాణ జెఎసికి ఎదురు తిరిగి ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి బిజెపి ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని పరకాల ఫలితం కల్పించింది. పరకాలలో కనీసం తెరాసకు బిజెపి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ రెండో స్థానంలో నిలువగా, తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. మూడు స్థానాల్లో బిజెపి ఎక్కడా లేకుండా పోయింది. మహబూబ్నగర్లో తమకు తెలంగాణ ఓటే పడిందని చెప్పుకోవడానికి కూడా బిజెపికి పరకాల ఫలితం వీలు లేకుండా చేసింది. ఇది బిజెపి స్వయంకృతాపరాధమేనని చెప్పాలి.