కాపును తడుతున్న జగన్: పూరీ, వివిలకు బెర్త్స్?
ఇటీవల దర్శకరత్న దాసరి నారాయణ రావు జగన్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెసులో చిరంజీవి క్రియాశీలకంగా మారడంతో దాసరి ఆ పార్టీలో నిమిత్తమాత్రుడిగా మారిపోయారు. దీంతో ఆయన పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు కొద్ది నెలలుగా వస్తున్నాయి. ఈ అసంతృప్తిని జగన్ పార్టీ క్యాష్ చేసుకుంటుందని అంటున్నారు. జగన్ దాసరి తదితరులను తన వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారట.
రెడ్లు ఎలాగూ తన వైపు ఉంటారు. ఇక కాపులను తన వైపుకు కొందర్ని ఆకర్షించడం ద్వారా ఓ సామాజిక వర్గం ఓట్లను చీల్చి తాను లబ్ధి పొందవచ్చునని భావిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో ఆ సామాజిక వర్గం వారినే రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారట. కృష్ణా జిల్లా నేత వంగవీటి రాధాకృష్ణ కొంతకాలం క్రితం జగన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఆయన దాసరి సూచనల మేరకే జగన్కు జై కొట్టారట! దాసరి తన పార్టీలోకి వస్తే మంచి ప్రాధాన్యత ఇస్తానని జగన్ హామీ ఇస్తున్నారట. అంతేకాకుండా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని బాగా అభిమానించే దర్సకుడు పూరీ జగన్నాథ్, ఆయన సోదరుడు జగన్ పార్టీలో చేరనున్నారనే వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. వారు పార్టీలో చేరితే పూరీ జగన్నాథ్కు విశాఖపట్నం టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ పార్టీ సుముఖత వ్యక్తం చేస్తోందట.
అలాగే పూరీ జగన్నాథ్ సోదరుడికి నర్సీపట్నం టిక్కెట్ ఇచ్చేందుకు సై చెప్పిందట. మరో అగ్ర దర్శకుడు వివి వినాయక్ కూడా జగన్ పార్టీలో చేరనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయనకు రాజమండ్రి లోకసభ స్థానం కేటాయించే అవకాశాలు ఉన్నాయట. అయితే సినిమా రంగంలో అగ్ర దర్శకులుగా కొనసాగుతున్న వీరు జగన్ పార్టీలో చేరి పార్లమెంటులో అడుగు పెట్టేందుకు ఎంత మేరకు మొగ్గు చూపుతారో చూడాలి. దర్శకులు ఇద్దరు పోటీ చేయకపోయినప్పటికీ పూరీ సోదరుడు మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.