తిరుమల ప్రధానార్చకుడి ప్రైవేట్ దీవెనలు
రమణదీక్షితులు వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆలయ నిబంధనలను అతిక్రమించి ఓ పారిశ్రామికవేత్త అతిథి గృహంలో కార్యక్రమాలు నిర్వహించినందుకు 2010 ఏప్రిల్ 10వ తేదీన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికార యంత్రాంగం మెమో జారీ చేసింది. పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు, సినీ తారలతో, సెలబ్రిటీలతో ఆయన భుజం భుజం రాసుకంటూ తిరుగుతారనే అభిప్రాయం ఉంది. ప్రధానార్చకుడిగా రమణదీక్షితులు స్వామి సేవలో మాత్రమే ఉండాలని అంటారు.
ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు కట్టుబడి స్వామివారి సేవకు మాత్రమే అంకితం కావాలని పండితులు అంటున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్ జగన్కు రమణదీక్షితులు 2009లో తిరుమలలో సుదర్శన హోమం నిర్వహించారని తిరుమల ఆలయ సంరక్షణ సమితికి చెందిన నరేంద్ర ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కోసం రమణదీక్షితులు పులివెందుల, హైదరాబాదు వెళ్లినట్లు కూడా ఆయన చెబుతున్నారు.
ఆలయ సంప్రదాయాలను ధిక్కరించిన రమణదీక్షితులుపై టిటిడి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. తరుచుగా సంప్రదాయాలను అతిక్రమిస్తున్న రమణదీక్షితులుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు.