వాన్పిక్లో జగన్ పార్టీ అభ్యర్థి బాలినేని?
వాన్పిక్ ప్రమోటర్ల నుంచి తాను డబ్బులు తీసుకున్నానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రాబబు నాయుడు గానీ రుజువు చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
వాన్పిక్ ప్రాజెక్టుకు భూములు స్వాధీనం చేయడంలో బాలినేని 300 కోట్ల రూపాయలు తీసుకున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. దాన్ని బాలినేని తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణను రుజువు చేయాలి లేదా మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డొక్కా మాణిక్య వరప్రసాద్ను సవాల్ చేశారు.
తనపై ఆరోపణల మీద బహిరంగ చర్చకు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులతో సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. బాలినేనిని అరెస్టు చేయాలని చంద్రబాబు ఓ సందర్భంలో అన్నారు. దీనికి బాలినేని ప్రతిస్పందిస్తూ అవినీతి ఆరోపణల్లో సిబిఐ అరెస్టుకు చంద్రబాబు సిద్ధపడాలని ఆయన అన్నారు.