610 జీవో: అశోక్ బాబు నోట ఉల్లంఘన మాట
రాష్ట్రాన్ని విభజించకూడదని చెప్పడానికి ఆయన ఆ వాస్తవాన్ని అంగీకరించారు. 610 జీవోను ఉల్లంఘించినంత మాత్రాన రాష్ట్రాన్ని విభజిస్తారా అని ఆయన అడిగారు. తెలంగాణ, సీమాంధ్ర మధ్య బంధాన్ని తల్లీ కూతుళ్లతో పోల్చారు. తెలంగాణ అనే అమ్మాయిని సీమాంధ్ర తల్లులు ఎప్పటికీ వదులుకోరని అన్నారు. బుధవారం విద్యుత్ సౌధలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
మరో వాస్తవాన్ని కూడా ఆయన అంగీకరించారు. 2009 తర్వాత తెలంగాణ విద్యార్థులు భావోద్వేగంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు ఎప్పుడూ ఘర్షణ పడలేదని తెలిపారు. ఇప్పటికైనా మాట్లేందుకు అవసరమైతే ఉస్మానియాకు వెళ్లేందుకూ తాను సిద్ధమన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెసు నాయకుడు తులసిరెడ్డి మాత్రం కాస్తా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్ మరో పాలస్తీనా అవుతుందని హెచ్చరించారు. ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు.
విభజనకు ఓకే అంటే రాష్ట్రం అనేక ముక్కలవుతుందని అన్నారు. ఒకసారి ప్రకటన చేశాక వెనక్కి తగ్గకపోవడానికి అదేమైనా శిలాశాసనమా? రాజ్యాంగాన్నే సవరించుకుంటున్నాం, ప్రకటనను సవరించుకుంటే తప్పా?' అని తులసిరెడ్డి ప్రశ్నించారు.