కిరణ్, జగన్పై బొత్స 'బొబ్బిలి' యుద్ధం
అవిశ్వాస తీర్మానం సమయంలో గీత దాటిన ఎమ్మెల్యేల్లో బొత్స జిల్లా విజయనగరంకు చెందిన బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు ఉన్నారు. జిల్లాలో బొత్సకు మంచి పట్టు ఉంది. ఉప ఎన్నికలు వస్తే బొబ్బిలి నియోజకవర్గంలో తన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలుపించుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనే ఉద్దేశ్యంతో బొత్స ఉన్నారట.
గీత దాటిన ఎమ్మెల్యేలపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసి ఉప ఎన్నికలు జరగాలని బొత్స గట్టిగా భావిస్తున్నారట. అందుకు కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం సిద్ధంగా లేరంటున్నారు. మరో రెండు నెలలు ఓపిక పడితే గీత దాటిన ఎమ్మెల్యేలపై వేటు వేసినా ఉప ఎన్నికలు రావు. అందుకోసం కిరణ్ యత్నిస్తున్నారట. కానీ బొత్స ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో కిరణ్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు.
తిరుపతి కిరణ్ జిల్లా చిత్తూరులోనే ఉంది. సొంత జిల్లాలోనే కిరణ్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించుకోలేక పోవడంపై అధిష్టానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు బొబ్బిలిలో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి తద్వారా అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసే ఆలోచనలో బొత్స ఉన్నారంటున్నారు.