నా నోరు, నా ఇష్టం: జర్నలిస్టులపై బొత్స వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేమిటని అడిగితే నా నోరు, నా ఇష్టమని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఆయన జర్నలిస్టులపై వ్యాఖ్యలు చేశారు.
తన నోరు తన ఇష్టమని, తమ ముఖ్యమంత్రికి తాము ఏదైనా చెప్పుకుంటామని బొత్స సత్యనారాయణ అన్నారు. తన గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చునని ఆయన జర్నలిస్టులతో చెప్పారు. బొత్స అనుచిత వ్యాఖ్యలపై ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల సంఘం మండిపడింది. బొత్స వ్యాఖ్యలను ఖండించింది.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో భేటీ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సీమాంధ్రకు చెందిన చిరంజీవి, పళ్లం రాజు తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించడం లేదని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పళ్లం రాజు అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతమైందని, తెలుగు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.