మాతృసంస్థకు లక్ష్మినారాయణ: జగన్కు ఊరట?
లక్ష్మినారాయణ వెళ్లిపోయిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు ఏమైనా ఊరట లభిస్తుందా అనేది చెప్పలేని విషయమే. జగన్ అరెస్టుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జెడిని కూడా నిందించారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాతనే ఆయన మాతృ సంస్థకు వెళ్లిపోతారని అంటున్నారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి అక్రమ మైనింగ్, ఎమ్మార్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తుల కేసులను ఆయన దర్యాప్తు చేశారు. మొదటి రెండు కేసుల దర్యాప్తు పూర్తయింది. జగన్ ఆస్తుల కేసుల దర్యాప్తును కూడా పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయడానికి లక్ష్మినారాయణ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్, మోపిదేవి వెంకటరమణ వంటి రాజకీయ నాయకులను, శ్రీలక్ష్మి, తదితర ఐఎఎస్ అధికారులను అరెస్టు చేసి ఆయన సంచలనం సృష్టించారు.
ఈ మూడు కేసులతో పాటు ఇతర ముఖ్యమైన కేసులను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మినారాయణ ఫోన్ సంభాషణల లీకేజీ వ్యవహారం కూడా వివాదంగా మారింది. ఆ ఆ వివాదం నడిచినప్పటి నుంచి ఆయన మీడియాకు దూరంగా ఉంటున్నారు. కొన్ని మీడియా సంస్థలకు ఎంపిక చేసిన సమాచారాన్ని లక్ష్మినారాయణ లీక్ చేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఆయనతో పాటు ఆయన జూనియర్ వెంకటేష్ కూడా మాతృ సంస్థకు వెళ్లిపోతారట.