ఆల్ పార్టీ: మీకంటే తెలివైనవాడినని బాబు నవ్వు
అయితే నాలుగు రోజుల క్రితం చంద్రబాబు విభజనపై అఖిల పక్షం ఎందుకు వేయలేదని డిమాండ్ చేశారు. అనుకోకుండానే ఆ మరుసటి రోజు అఖిల పక్షం వేస్తున్నట్లు షిండే ప్రకటించారు. ప్రధానంగా టిడిపిని ఇబ్బంది పెట్టేందుకే అఖిల పక్షం వైపు మొగ్గు చూపిందంటున్నారు. ఇరు ప్రాంతాల్లో టిడిపికి మంచి క్యాడర్ ఉంది. దీంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అఖిల పక్షం వేయడంతో ఏం చేయాలా అని టిడిపి తర్జన భర్జన పడుతోంది.
మిగతా అన్ని పార్టీలకు విభజనపై ఓ క్లారిటీ ఉంది. కాంగ్రెసు, బిజెపి, లెఫ్ట్ పార్టీలు జాతీయ పార్టీలు. వాటికి ఇబ్బంది లేదు. ఇక రాష్ట్రానికి సంబంధించినంత వరకు తెరాస తెలంగాణలో, వైయస్సార్ కాంగ్రెసు సీమాంధ్రకు, మజ్లిస్ హైదరాబాదుకే పరిమితమైంది! ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో క్యాడర్ ఉన్న టిడిపియే ఇరుకున పడిందంటున్నారు.
కాగా, ఎప్పుడూ సీరియస్గా కన్పించే చంద్రబాబు గురువారం నాటి మీడియా సమావేశంలో కాస్త ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన, తాజా పరిణామాలపై వచ్చిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులను దాట వేశారు.
విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. మీరు సంచలనాల కోసం చూస్తారని, ఇరుకున పెట్టాలని చూస్తారని, మీరు కావాలనుకున్నది తాను చెప్పనని దాటేశారు. విభజనపై మీ స్టాండ్ ఏమిటని ప్రశ్నిస్తే... పరీక్షల్లో పాఠం 30 మందీ వింటారని, ఒకరికి 90, మరొకరికి 70, మరొకరికి 30 మార్కులు వస్తాయని, ప్రశ్న ఒకటే ఉంటుందని, దానికి సమాధానం కూడా ఒకటే ఉంటుందని, మీరే రకరకాలుగా విశ్లేషించి రాస్తారు వాటితోనే సమస్యలన్నారు.
రెండు కళ్ల సిద్ధాంతంపై ప్రశ్నించగా, అడిగిన విలేకరిని మీకు పిల్లలెంతమంది అని బాబు అడిగారు. అతను ఒక్కరని చెప్పడంతో బాబు నవ్వేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలున్నప్పుడు ఎలా సర్ది చెబుతావని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై మీ ఫైనల్ జవాబు ఏమిటని ప్రశ్నిస్తే.. నవ్వుతూ... రామాయణం అంతా విని సీత రాముడికి ఏమైందన్నట్టు ఉంది మీ వరస... మీరే తెలివైన వారనుకుంటే ఎలా? నేను మీకంటే తెలివైన వాడినని, రోజుకి వంద మంది విలేకరులకు సమాధానం చెబుతుంటానని అన్నారు.