చిరంజీవి అభిమానుల అవహేళన: తగ్గిన షర్మిల
గురువారం ఆమె చిరంజీవిని విమర్శించినప్పుడు మెగాస్టార్ అభిమానులు ఆమెను అవహేళన చేశారట. ఆమె వేలాది మంది కార్యకర్తలతో కాకినాడలోకి ఎంటర్ అయ్యారు. ఆమె జగన్నాయకపూర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటుందని విమర్శించారు. విపక్షాలపై సిబిఐని ఉసిగొల్పుతూ.. పార్టీ నేతలను మాత్రం కాపాడుతోందని మండిపడ్డారు.
ఇదే సమయంలో ఆమె చిరంజీవి పేరును ప్రస్తావించారు. కొద్ది నెలల క్రితం చెన్నైలోని చిరంజీవి బంధువు ఇంట్లో రూ.90 కోట్లు దొరికాయని, అయినప్పటికీ దానిపై ఎలాంటి విచారణ జరగడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో అక్కడున్న కొందరు చిరు అభిమానులు ఎద్దేవా చేశారట. దీంతో చిరంజీవి పేరు ప్రస్తావించడంతో ఎదురైన ఇబ్బందిని గుర్తించిన షర్మిల వెంటనే తన ప్రసంగాన్ని మార్చారట.
ఆ వెంటనే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పేరును ఎత్తుకున్నారట. బొత్స లిక్కర్ మాఫియా అని మండిపడ్డారు. బొత్స లిక్కర్ మాఫియా అని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించే ఎలాంటి అవిశ్వాసానికైనా తాము మద్దతిస్తామని షర్మిల చెప్పారు. ఉప ఎన్నికలు రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలపై వేటును ఆలస్యం చేశారని ఆమె ఆరోపించారు.