లగడపాటికి ఎదురుదెబ్బ: తెలంగాణకు సినారె సై
దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఏడు ఉన్నపుడు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉంటే అభ్యంతరమెందుకని సినారె ప్రశ్నించారు. 'జై తెలంగాణ అంటే...సై తెలంగాణ' అని నినదించారు. తాను రాజ్యసభసభ్యుడుగా ఉన్నకాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చిన్న రాష్ట్రాలే శ్రేయోదాయకంగా ఉంటాయని చేసిన ప్రకటనను స్వాగతించినట్టు గుర్తు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తాను విద్యార్ధిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించానని చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం అనివార్యమైందని తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఎన్ గోపీ అన్నారు. పంతాలకు పట్టింపులకు పోకుండా కేంద్ర, రాష్ట్రపాలకులు విజ్ఞతతో ఆలోచించి తెలంగాణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిపై వైఎస్ ఉద్దేశపూరవకంగా వివక్ష ప్రదర్శిచారని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. తెలుగు పుస్తకాలు చదివినా.. మాట్లాడినా ద్రోహులుగా చూసేకాలంలో చదివి, తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న బాధలు తెలిసిన వ్యక్తిగా మరింత కసితో తెలంగాణ పోరాటంలో పాల్గొంటున్నట్టు చెప్పారు.
తెలంగాణ తేల్చేవరకు ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించాల్సిందేనని ప్రజాగాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు.'ఉద్యమాల యుగం మనది, ఉద్యమిస్తే జయం మనది' అంటూ ఉద్యమకారులకు కవులు, కళాకారులు, రచయితలు ఉత్సాహాన్ని నింపాలని సూచించారు. రచయితలుగా తెలంగాణ ఉద్యమాన్ని మేల్కొల్పడంతోపాటు కాలంతోపాటు కదిలేలా ప్రోత్సాహించాలని గద్దర్ సూచించారు. శబ్దం భౌతికశక్తి రూపమే ఆట, పాట, మాటలని ఆయన అభివర్ణించారు.