కిరణ్ రెడ్డి చివరి బంతి: దామోదర టీ ధోనీ
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రికెట్ పదజాలం రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి చేరింది. నిజాం కళాశాలలో చదువుతున్నప్పుడు క్రికెట్ జట్టుకు కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహించారు. రాష్ట్ర విభజన వ్యవహారంలోనూ క్రికెట్ పదజాలం ముఖ్యంగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తన వద్ద ఇంకా చివరి బంతి ఉందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి క్రికెట్ భాషకు అదే భాషలో తెలంగాణ నేతలు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణ కోసం పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సమరం సాగిస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను తెలంగాణ ధోనీగా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయ శక్తులే అన్నివైపులా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. "వారు (సీమాంధ్ర నేతలు) చెబుతున్నట్టు చివరి బాల్ మిగిలే ఉంది. ఆ బాల్ దూస్రా అయినా.. గూగ్లీ అయినా.. యార్కర్ వేసినా.. కొట్టేందుకు మనం సిద్ధంగా ఉండాలి. ఆఖరి తంతు పూర్తయ్యే వరకు అప్రమత్తత అవసరం' అని సూచించారు.
అక్కడే ఉన్న తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ ఆ వెంటనే జోక్యం చేసుకున్నారు. "చివరి బంతి మిగిలుందని సీమాంద్రులు చెబుతున్నారు. ఆ బంతిని సిక్స్గా మలచగల 'ధోనీ' రాజనరసింహ మనకు ఉన్నార'ని సరదాగా అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం - 2014 డైరీ ఆవిష్కరణ సభలో ఇది చోటు చేసుకుంది.