ఎన్నికల్లో వివాదాస్పద హీరో త్రిపాత్రాభినయం
కన్నడనాట ఓ శాండిల్ వుడ్ స్టార్ మూడు పార్టీల తరఫున ప్రచారం చేస్తున్నారు! అతను మూడు పార్టీల కోసం కాకుండా మూడు పార్టీల్లోని అభ్యర్థుల కోసం మాత్రమే ప్రచారం చేస్తున్నారు. కన్నడ యువ నటుడు దర్శన్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అంబరీష్, జెడిఎస్ అభ్యర్థి అప్పుగోళ్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద లింబావళిల తరఫున ప్రచారం నిర్వహిస్తుండటం విశేషం. ఇది అక్కడ అందరకీ ఆసక్తికంగా మారిపోయింది.
దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, వ్యక్తులే ముఖ్యమని చెప్పారు. ఇతను మాండ్య నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేస్తున్న ప్రముఖ నటుడు అంబరీష్ తరఫున ప్రచారం నిర్వహించారు. అంబరీష్ సతీమణి, ప్రముఖ నటి సుమలతతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఇతను మంగళ, బుధవారాల్లో ప్రచారం నిర్వహించారు.
గురువారం బెళగావి జిల్లా కిత్తూరులో జెడిఎస్ అభ్యర్థి ఆనందం అప్పుగోళ్ తరఫున ప్రచారంలో పాల్గొన్నాడు. త్వరలో బెగళూరులోని మహదేవపుర నియోజకవర్గంలో బిజెపి నుండి అభ్యర్థిగా బరిలో నిలిచిన అరవింద లింబావళికి ప్రచారం నిర్వహిస్తారు. అరవింద ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.
అంబరీష్ తనకు గురువు అని, ఆనంద్ మంచి వ్యక్తి అని, మంత్రి లింబావళి తన స్నేహితుడు అని అందుకే వేర్వేరు పార్టీలు అయినా వారికి ప్రచారం చేస్తున్నట్లు దర్శన్ చెప్పారు. కాగా, కాంగ్రెస్ స్టార్ కంపెయినర్ల చిట్టాలో దర్సన్ పేరు ఉంది. ఇతర పార్టీలకు ప్రచారం చేస్తుండటంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
దర్శన్ వైఖరిపై రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దీనిపై దర్శన్ స్పందిస్తూ.. తాను ఏ పార్టీ సభ్యుడిని కాదని, నాకిష్టమైన అభ్యర్థులకు ప్రచారం చేస్తానని, అది తన వ్యక్తిగత విషయమని చెప్పారు. కాగా హీరో దర్శన్ గతంలో భార్యను కొట్టాడనే ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.