కెప్టెన్ ధోనీ తదుపరి టార్గెట్ విరాట్ కోహ్లీ?
ఇటీవల క్రికెట్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వివియస్ లక్ష్మణ్ ధోనీ నిర్ణయాలను తప్పు పట్టి తర్వాత నాలుక కరుచుకున్నారు. ధోనీ ప్రాబల్యానికి తట్టుకోలేకనే వారు మాట మార్చి తిరిగి ధోనీపై ప్రశంసలు కురిపించారనే పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అంతగా ధోనీ లోలోన రాజకీయాలకు పదను పెడుతున్నాడని అంటున్నారు.
జట్టు నుంచి గంగూలీ నుంచి లక్ష్మణ్ వరకు తప్పుకోవాల్సి రావడంలో ధోనీ రాజకీయ ఎత్తుగడలే పనిచేశాయని కూడా అంటారు. ఈ విషయంలో లక్ష్మణ్ బయటపడిన సందర్భాన్ని కూడా చూశాం. తనకు పోటీ వస్తారని భావించిన ప్రతి ఒక్కరినీ ఆయన బయటకు పంపించడంలో విజయం సాధిస్తున్నాడనే మాట వినిపిస్తోంది. తాము లేకుంటే జట్టు లేదనే పద్ధతిలో వ్యవహరించిన గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ జట్టులో స్థానం కోల్పోయారు. గంభీర్ కెప్టెన్సీకి పోటీ కూడా పడ్డాడు. గంభీర్ మాట అలా ఉంచితే, సెహ్వాగ్ తిరిగి జట్టులోకి రావడం అనుమానంగానే కనిపిస్తోంది.
కాగా, ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లలో మొనగాడు అనిపించుకున్న విరాట్ కోహ్లీ మెల్లగా తెరమరుగు అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఛతేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్ల ముందు అతను దిగదుడుపు అవుతున్నాడు. అంతగా రాణించలేకపోతున్నాడు కూడా. అలా రాణించకపోవడానికి జట్టులోని రాజకీయాలు కూడా కారణమవుతాయా అనేది బయటకు వాళ్లకు తెలిసేది కాదు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ బాటలో ఉన్నాడు. ఈ స్థితిలో అతను సరిగా ఆడలేకపోతున్నాడు. ధోనీ తాజా టార్గెట్ విరాట్ కోహ్లీయేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.